Hyderabad Corona Second Wave: హైదరాబాద్‌లో మరోసారి రెచ్చిపోతున్న కరోనా

కేంద్ర ప్రభుత్వం గతేడాది జూన్‌ నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలను క్రమంగా సడలిస్తూ వచ్చింది. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడంతో పాటు హోటళ్లు, పార్కులు, ఇతర దర్శనీయ ప్రదేశాల్లోకి ప్రజలను అనుమతించేశారు. అంతాబాగానే ఉందనుకుంటున్న జనం బయటకు ఎక్కువగా రావడం మొదలుపెట్టారు.

Corona For 38 Students At Nagole Minority Girls Residential School Hyderabad

Hyderabad Corona Second Wave: కేంద్ర ప్రభుత్వం గతేడాది జూన్‌ నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలను క్రమంగా సడలిస్తూ వచ్చింది. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడంతో పాటు హోటళ్లు, పార్కులు, ఇతర దర్శనీయ ప్రదేశాల్లోకి ప్రజలను అనుమతించేశారు. అంతాబాగానే ఉందనుకుంటున్న జనం బయటకు ఎక్కువగా రావడం మొదలుపెట్టారు. వ్యాక్సిన్‌ సైతం ఇస్తుండడంతో సెల్ఫ్ కంట్రోల్‌ను పూర్తిగా వదిలేశారు. సినిమాలు, విందులు, వినోదాలతో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. మరోవైపు మాస్కులు, శానిటైజేషన్, భౌతికదూరం నిబంధనలూ గాలికొదిలేశారు. ఇలా వైరస్‌ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది.

వారం రోజుల్లో 511 కేసులు
అధికారికంగా ప్రకటించిన రిపోర్టు ప్రకారం గ్రేటర్‌ హైదరాబాద్‌లో గత వారంలో రోజుల్లో 511 కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 278, రంగారెడ్డి జిల్లాలో 104, మేడ్చల్‌ జిల్లాలో 129 కేసులు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. అనధికారికంగా హైదరాబాద్‌ జిల్లా పరిధిలోనే రోజుకి 150 పైనే కరోనా కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది.

958 మందికి ఆస్పత్రుల్లో చికిత్స
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3లక్షల 1769 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీటిలో రెండు లక్షల కేసులు గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనే ఉన్నాయి. అంతేకాదు 1659 మంది మృతుల్లో వెయ్యి మందికిపైగా సిటీ జనులే. ప్రస్తుతం 2వేల 101 యాక్టివ్‌ కేసులు ఉండగా, వీరిలో 958 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో 60 శాతం మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతుండగా, 40 శాతం మంది సాధారణ ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం గాంధీలో 63 మంది, టిమ్స్‌లో 75 మంది, కింగ్‌కోఠిలో 73మంది చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారంతా అపోలో, యశోదా, కేర్, మెడికవర్, సన్‌షైన్, కిమ్స్, ఏఐజీ వంటి కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందున్నారు.

సెల్ఫ్ కేర్ మోస్ట్ ఇంపార్టెంట్
వాతావరణంలో మార్పులతో దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తున్నాయి. చాలా మంది కరోనా వైరస్‌ను సైతం సాధారణ జ్వరంగా భావించి టెస్టింగ్, ట్రీట్మెంట్‌కు దూరంగా ఉంటున్నారు. మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగేస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి ఇలాగే వైరస్‌ విస్తరిస్తుంది. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ..మాస్కులు ధరించి.. శానిటైజేషన్‌, భౌతికదూరం నిబంధనలు తప్పక పాటించాలి. వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదని గుర్తుపెట్టుకోవాలి.

సీజనల్ ఫీవర్‌లో కలిసిపోయి:
ప్రస్తుతం సీజన్‌ మారింది. చలి పోయి ఉక్కపోత మొదలైంది. వాతావరణంలో చోటు చేసుకున్న ఈ మార్పులతో అనేక మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కరోనా వైరస్‌లోనూ ఇవే లక్షణాలు కన్పిస్తాయి. ఫలితంగా ఎవరికి కరోనా ఉందో? మరెవరికి రానుందో? గుర్తించడం వైద్యులకూ ఇబ్బందిగా మారింది. దగ్గు, జలుబు, జ్వరంతో పాటు ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

అధికారుల నిర్లక్ష్యం
వైరస్‌ను కట్టడి చేయడంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విఫలం అవుతున్నారు. అనుమానంతో పీహెచ్‌సీలకు వచ్చే వారికి టెస్టులు చేయడం మినహా ఆ తర్వాత ఎలాంటి ఫాలోఅప్‌లు లేవు. వైరస్‌ ఎంటరైన మొదట్లో ఇంట్లో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయితే ఇంటి సమీపంలో వీధుల్లోకి వెళ్లే దారులన్నీ మూసివేసి, ఇంటింటికి తిరిగి స్క్రీనింగ్‌ చేసేవారు. వైరస్‌ నిర్ధారణ అయిన వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స చేసేవారు.

వైద్య ఆరోగ్యశాఖ ప్రస్తుతం కేసుల ట్రేసింగ్‌ను పూర్తిగా విస్మరించడమే కాక, కంటైన్మెంట్‌ జోన్ల పద్ధతిని కూడా పూర్తిగా ఎత్తేసింది. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిపై నిఘా కూడా లేదు. వారంతా మందులు, మార్కెట్ల పేరుతో ఇష్టారాజ్యంగా బయట తిరుగుతున్నారు. వైరస్‌ను అంతా లైట్‌గా తీసుకుంటుండటంతో ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తోంది.