మక్తల్ బీజేపీ అభ్యర్థి సూసైడ్పై స్పందించిన డీజీపీ.. భయంలేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి
ఎన్నికల నేపథ్యంలో 1,183 లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్ అయ్యాయని తెలిపారు.
- T Venkateshwarlu
- Published On : February 10, 2026 / 01:27 PM IST
DGP Shivadhar reddy
- సూసైడ్పై కేసు నమోదయింది
- సూసైడ్ నోట్ లభించలేదు
- నిష్పక్షపాతంగా విచారణ
DGP Shivadhar reddy: మక్తల్ బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప బలవన్మరణంపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్లో శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. సూసైడ్పై కేసు నమోదయిందని వివరించారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని అన్నారు. సూసైడ్ అంశంపై నిష్పక్షపాతంగా విచారణ సాగుతుందని చెప్పారు.
“తెలంగాణలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న ఎన్నికలు జరుగుతున్నాయి. హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా జనవరి 27 నుంచి మోడల్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో 1,183 లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్ అయ్యాయి. 4,318 మందిపై గుడ్ బిహేవియర్ బౌండ్ ఓవర్ చర్యలు తీసుకుంటున్నాం. 398 నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేశాం” అని తెలిపారు.
Also Read: అభ్యర్థి మృతి.. డీజీపీ ఆఫీస్ను ముట్టడించిన బీజేపీ.. ఉద్రిక్తత
మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నట్లు శివధర్ రెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 181 FST, 167 SST బృందాలు విధుల్లో ఉన్నాయన్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘన కేసులు మొత్తం 142 నమోదైనట్లు తెలిపారు.
ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల నుంచి సైలెంట్ పీరియడ్ అమలు అవుతోందని వివరించారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో 100 శాతం వెబ్ కాస్టింగ్ ఉంటుందని అన్నారు. భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
