Kotha Prabhakar Reddy : దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి.. హుటాహుటీన ఆస్పత్రికి తరలింపు
బీఆర్ఎస్ దుబ్బాక నియోజకవర్గం అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగింది. గటని రాజు అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు.
- Harish Thanniru
- Updated on- October 30, 2023 / 02:20 PM IST
Prabhakar Reddy
BRS Candidates Kotha Prabhakar Reddy : బీఆర్ఎస్ దుబ్బాక నియోజకవర్గం అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగింది. గటని రాజు అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి ఎన్నికల ప్రచారంలో ప్రభాకర్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో రాజు కత్తితో ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, కార్యకర్తలు ప్రభాకర్ రెడ్డిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు.
ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తిని స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. గాయాలైన ప్రభాకర్ రెడ్డిని సూరంపల్లి నుంచి గజ్వేల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కత్తితో దాడి చేయడంతో తీవ్రగాయమైనట్లు తెలిసింది. గజ్వేల్ ఆస్పత్రి నుంచి వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. నారాయణఖేడ్ సభకు వెళ్తుండగా మంత్రి హరీశ్ రావుకు సమాచారం అందడంతో వెంటనే గజ్వేల్ ఆస్పత్రికి బయల్దేరి వెళ్లారు. ఎంపీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
