Eatala Jamuna: హుజురాబాద్‌ నుంచి బరిలోకి ఈటల జమున?

తెలంగాణ రాష్ట్రసమితి నుంచి ఈటల రాజేందర్ బయటకు వచ్చేశాక రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

Eatala Jamuna: తెలంగాణ రాష్ట్రసమితి నుంచి ఈటల రాజేందర్ బయటకు వచ్చేశాక రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రతిపక్ష కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్ పార్టీల నుంచి హుజురాబాద్‌లో రాబోయే ఉపఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారంటూ భిన్న వాదనలు వినిపిస్తున్న సమయంలో బీజేపీ నుంచి పోటీ చేయబోయే అంశంలో కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఈటల రాజేందర్ బీజేపీలో చేరగా ఆయనే అక్కడి నుంచి పోటీ చేస్తారంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఈటల భార్య జమున అక్కడి నుంచి పోటీ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఒకవైపు టీఆర్ఎస్ నుంచి ఎల్ రమణ పోటీ చేస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తుండగా.. ఇప్పటికే కౌశిక్ రెడ్డి కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టఆర్ఎస్ అవకాశం ఇస్తుందని ఎదురుచూస్తున్నారు. ఈటెల రాజేందరే పోటీ చేస్తారంటూ బీజేపీ భావిస్తుండగా.. ఆయన భార్య జమున ఈ స్థానంలో పోటీ చేయబోతున్నట్లుగా హుజురాబాద్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఇటీవలే టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటల రాజేందర్ తన భార్యనే ఇక్కడి నుంచి పోటీకి పెట్టబోతున్నట్లుగా చెబుతున్నారు.

ఇప్పటికే పాదయాత్ర చేపట్టి గడపగడపకూ తిరిగి ప్రచారం చేస్తున్న ఈటల సతీమణి.. ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు పోటీ చేస్తామంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. గుర్తు ఒక్కటే.. వ్యక్తులు మారితే మారొచ్చని ఆమె పోటీ చేస్తానని పరోక్షంగా చెప్పుకొచ్చారు. లేటెస్ట్‌గా ఆమె చేసిన వ్యాఖ్యలతో హుజూరాబాద్ రాజకీయాలు ఆసక్తికరంగా మారింది.
ఈటలకు ధీటుగా బరిలోకి ప్రత్యర్థి అభ్యర్థిని ఎవరిని దించాలా అనే ఆలోచనలో టీఆర్ఎస్ ఉంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్‌లో చేరిన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ ఆ పార్టీ నుంచి బరిలో దిగే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు