బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ ప్రచారం.. కేటీఆర్ ఏమన్నారంటే..

24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది. ఇవన్నీ దాటుకొని 24 ఏళ్ల పాటు నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్.

Ktr : బీఆర్ఎస్ త్వరలో బీజేపీలో విలీనం అవుతుందనే ప్రచారంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. విలీనం, పొత్తు వార్తలను కేటీఆర్ ఖండించారు. అందులో వాస్తవం లేదన్నారు. అంతేకాదు బీఆర్ఎస్ పై నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్న వాళ్లకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ పైన విలీనం లాంటి ఎజెండా పూరిత దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలన్నారు. లేదంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ సేవలు అందిస్తూనే ఉందని, ఇది ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు.

”తప్పుడు ఎజెండాలతో నిరాధారమైన రూమర్స్ వ్యాప్తి చేసే వారికి ఇదే మా చివరి హెచ్చరిక. దీనిపై వెంటనే రిజాయిండర్ ను ప్రచురించండి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్.

”24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది. ఇవన్నీ దాటుకొని 24 ఏళ్ల పాటు నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్. సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని, అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపాము. ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టే ఇది సాధ్యమైంది. ఎప్పటిలానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది, పోరాడుతుంది. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలను, దుష్ప్రచారాలను మానుకోవాలి. పడతాం, లేస్తాం, తెలంగాణ కోసమే పోరాడతాం.. కానీ తలవంచం” అని ట్వీట్ చేశారు కేటీఆర్.

Also Read : సభలో అడుగు పెట్టేది అప్పుడే..! అసెంబ్లీకి హాజరుపై పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ క్లారిటీ..!

ట్రెండింగ్ వార్తలు