Gaddar: నీ పాటనై వస్తున్నానమ్మో అంటూ పలకరించే గద్దరన్న ఇకలేరు
అనారోగ్యంతో కొన్ని రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
- T Venkateshwarlu
- Published On : August 6, 2023 / 03:25 PM IST
Gaddar
Gaddar passed away: నీ పాటనై వస్తున్నానమ్మో అంటూ అందరినీ పలకరించే ప్రజాగాయకుడు గద్దరన్న (77) కన్నుమూశారు. ఉద్యమ గళం మూగబోయింది. అనారోగ్యంతో కొన్ని రోజులుగా హైదరాబాద్(Hyderabad)లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గద్దర్కు పది రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ప్రజా యుద్ధ నౌకగా గద్దర్ పేరు తెచ్చుకున్నారు. గద్దర్ గా అందరికీ సుపరిచితమైన ఆయన పేరు గుమ్మడి విఠల్ రావు. ఆయనో విప్లవ కవి. మెదక్ జిల్లా లోని తూప్రాన్ గ్రామంలో 1949లో గద్దర్ జన్మించారు. లచ్చమ్మ, శేషయ్య ఆయన తల్లిదండ్రులు.
తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొంటూ తన పాటలతో చైతన్యం నింపారు. 1985లో గద్దర్ కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ ఒకరు.
గద్దర్ ఒగ్గు కథ, బుర్ర కథల ద్వారా పల్లె ప్రజలను అలరించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. దళితులు అనుభవిస్తున్న కష్టాల గురించీ తనదైన శైలిలో ప్రదర్శనలు ఇచ్చేవారు. గద్దర్ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదివారు. గద్దర్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
గద్దర్ లో కమ్యూనిస్ట్ భావజాలం ఉంది. అయినప్పటికీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఆయన మొదటి నుండి తెలంగాణవాదే. టీడీపీ నేత దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీ స్థాపించిన సమయంలో ఆయనకూ గద్దర్ మద్దతు తెలిపారు గద్దర్. తెలంగాణ ఉద్యమానికి తన పాటలతో మరింత ఊపు తెచ్చారు.
గద్దర్ ఈ ఏడాది జూన్ 21న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. గద్దర్ ప్రజాపార్టీని స్థాపిస్తున్నట్లు చెప్పారు. ఆ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కూడా కలిశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానని మీడియా సమావేశంలో ప్రకటించారు.
Gaddar Passesd away
