ఆ ఇద్దరు అక్కలపై సీఎం రేవంత్ రెడ్డి కోపానికి అసలు కారణం ఇదే?

సీఎం వ్యాఖ్యల వెనుక ఇంత స్టోరీ ఉందని తెలియక.. ఎవరికి తోచింది వారు చర్చించుకుంటున్నారు. అటు సీఎం రేవంత్, ఇటు మంత్రి సీతక్క కామెంట్లను బేస్‌ చేసుకుని బీఆర్‌ఎస్‌ రాద్ధాంతం చేస్తుండటంతో.. అసలు విషయమేంటో హస్తం పార్టీ నేతలు ఆఫ్‌ ద రికార్డులో చెబుతున్నారు.

Gossip Garage : ఇద్దరూ ఇద్దరే అన్నట్లు రెండు రోజులుగా తెలంగాణను ఊపేస్తున్న అక్కా తమ్ముళ్లు… అక్కలు ఇద్దరు కన్నీరు పెట్టడం… మీరు చేసిన ద్రోహం వల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందని… ఇంకో చెల్లి, తమ్ముడు ఎదురుదాడి చేయడం… రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా ఈ ఇద్దరి కోసమే మాట్లాడుకోవడం… హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఈ ఇద్దరు… ఆ ఇద్దరి గొడవేంటి? ఎక్కడ మొదలైంది..?

సీఎం వ్యాఖ్యలపై కలవరానికి వేరే కారణం వేరే ఉందనే టాక్‌..
తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు కాక పుట్టిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేయగా, రెండు రోజులుగా సభ లోపలా, బయటా అదే అంశం రచ్చకు దారితీసింది. వారం రోజులుగా ప్రశాంతంగా సాగుతున్న సభలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో ఒక్కసారి కలకలం రేగినా… ఈ కలవరానికి కారణం వేరే ఉందనే టాక్‌ ఆసక్తి రేపుతోంది. ఎన్నడూ లేనట్లు ఇద్దరు మహిళా నేతలను సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌ చేయడం… వెంటనే ఆ ఇద్దరిలో ఒకరైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారంటూ ఆవేదన చెందడం అసెంబ్లీ ఎపిసోడ్‌. అయితే అదే అసెంబ్లీలో మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు… సీఎం కామెంట్లపై రకరకాల చర్చకు దారితీశాయి.

ఢిల్లీ వస్తామని రాలేదనే కోపమే కారణమా?
ఢిల్లీ వస్తామని రాలేదనే కోపమే సీఎం వ్యాఖ్యలకు కారణమన్నట్లు సీతక్క ఇచ్చిన వివరణతో రాజకీయ వర్గాల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు… సీఎం రేవంత్‌రెడ్డికి హ్యాండిచ్చినట్లు సీతక్క చెప్పడంతో…. అసలు విషయం ఏంటై ఉంటుందని అంతా ఆరా తీస్తున్నారు. దీంతో ఓ తాజా సమాచారం పొలిటికల్‌ సర్కిల్స్‌లో విస్తృత చర్చకు దారితీస్తోంది. గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి… సునీతా లక్ష్మారెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డికి మంచి సంబంధాలే ఉండేవని చెబుతున్నారు.

సబిత, రేవంత్‌ కి మధ్య రెండు మూడు విషయాల్లో భేదాభిప్రాయాలు..
అసెంబ్లీలో జరిగిన గొడవను బట్టి…. తనను కాంగ్రెస్‌లోకి పిలిచి… ఆ ఇద్దరూ బీఆర్‌ఎస్‌లో చేరినట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కానీ, వివాదానికి అసలు కారణం అది కాదని సమాచారం. సబితకు రేవంత్‌ రెడ్డికి మధ్య రెండు మూడు విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయని… కానీ, ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటనలే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహానికి కారణమని అంటున్నారు. ఇక సునీతా లక్ష్మారెడ్డి సైతం సబితతోపాటే సీఎం రేవంత్‌ రెడ్డికి హ్యాండిచ్చారంటున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి తాజా కోపానికి అసలు కారణం ఏంటి?
2018 ఎన్నికలకు ముందు సబితా ఇంద్రారెడ్డి ఆహ్వానం మేరకే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చారనే విషయంతో అంతా ఏకీభవిస్తున్నా.. అలా పార్టీలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న ఓ సంఘటన వల్లే సబిత కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందంటున్నారు. అప్పట్లో సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌ నుంచి పోటీ చేయగా, సబిత మహేశ్వరం నుంచి పోటీ చేశారు. ఈ ఇద్దరిలో సబిత మాత్రమే గెలిచారు. ఇక ఆ తర్వాత జరిగిన 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సబిత కుమారుడు కార్తీక్‌రెడ్డి చేవెళ్ల ఎంపీగా పోటీ చేయాలని భావిస్తే… అప్పటి బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి తెచ్చి.. కార్తీక్‌రెడ్డికి రావాల్సిన సీటును రేవంత్‌ అడ్డుకున్నారని సబిత ఆరోపిస్తున్నారు. ఆ కారణంతోనే సబిత బీఆర్‌ఎస్‌లో చేరారని చెబుతున్నారు. ఐతే సీఎం రేవంత్‌రెడ్డి తాజా కోపానికి ఐదేళ్ల క్రితం నాటి ఈ ఘటన కారణం కాదని… అది ఓ సాకుగా మాత్రమే చెబుతున్నారని అంటున్నారు.

ఆ కారణంగానే ఆ ఇద్దరినీ నమ్మొద్దనే భావన వ్యక్తం చేశారట..
రాజకీయాల్లో ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య అక్కా తమ్ముళ్ల బంధం ధృడంగానే ఉండేదట. సబిత కుమారుడు కార్తీక్‌రెడ్డి కూడా సీఎం రేవంత్‌కు మంచి స్నేహితుడని చెబుతున్నారు. ఇద్దరి మధ్య ఇంతటి అనుబంధం వల్లే అసెంబ్లీ ఎన్నికల తర్వాత సబితను తిరిగి కాంగ్రెస్‌లోకి రమ్మని సీఎం ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. సబితతోపాటే నర్సాపురం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు పావులు కదిపినట్లు చెబుతున్నారు. సీఎం ప్రతిపాదనకు తొలుత ఈ ఇద్దరూ ఒకే అన్నా… చివరి క్షణంలో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరూ కాంగ్రెస్‌లోకి వస్తారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్‌ను సైతం సీఎం తీసుకున్నారట… కానీ ఆఖరి నిమిషంలో హ్యాండ్‌ ఇవ్వడంతో రాహుల్‌ వద్ద తన ఇజ్జత్‌ పోయినట్లు సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు. ఆ కారణంగానే ఆ ఇద్దరినీ నమ్మొద్దనే భావన వ్యక్తం చేశారంటున్నారు.

సీఎం వ్యాఖ్యల వెనుక ఇంత స్టోరీ ఉందని తెలియక.. ఎవరికి తోచింది వారు చర్చించుకుంటున్నారు. అటు సీఎం రేవంత్, ఇటు మంత్రి సీతక్క కామెంట్లను బేస్‌ చేసుకుని బీఆర్‌ఎస్‌ రాద్ధాంతం చేస్తుండటంతో.. అసలు విషయమేంటో హస్తం పార్టీ నేతలు ఆఫ్‌ ద రికార్డులో చెబుతున్నారు. ఇలా అక్కా, తమ్ముడి మధ్య లొల్లికి రీజన్‌ ఏంటో తెలిసి ఓహో అదా సంగతి అని చర్చించుకుంటున్నారు.

Also Read : కవిత వల్లే ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్‌ని వీడారా? అసలేం జరిగింది..

ట్రెండింగ్ వార్తలు