KCR
KCR: తనను తిట్టడం, తన చావును కోరుకోవడమే పనిగా ఈ ప్రభుత్వం పెట్టుకుందని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి రిజల్ట్స్ సాధించిందని అన్నారు. అధికార పార్టీకి ఉన్న ప్రజా వ్యతిరేకత ఈ ఎన్నికల ఫలితాల్లో కనిపించిందని చెప్పారు.
ఇవాళ కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “పార్టీని గెలిపించడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారు. మనం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ ఇలాంటి అహంకార పూరిత, హింసాయుత ప్రయత్నాలు చేయలేదు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనము ఎట్లా ప్రతిపక్షాలతో వ్యవహరించాలో నేర్పుతోంది. గుడ్లు తీయడం, లాగులో తొండలు వేయడం వంటివి ఎట్లా చేయాలో చెబుతున్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో ఒక కొత్త పాలసీ తేలేదు. తీసుకువచ్చిన పాలసీ అంతా భూమి రియల్ ఎస్టేట్ కు సంబంధించిందే అయినా రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది.
ఒకప్పుడు యూరియా ఇంటికి, చేను వద్దకు డైరెక్టుగా వచ్చేది. కానీ, ఇప్పుడు ఒక్క యూరియా బస్తా కోసం కుటుంబం అంతా లైన్లలో నిలబడే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకం ఒకటి కూడా ప్రకటించకపోగా ఉన్న వాటిని ఆపేసింది” అని అన్నారు.