BRS Formation Day : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడులు.. జెండా ఆవిష్కరించిన కేటీఆర్.. కవిత పార్టీ, ఆమె వ్యాఖ్యలపై ఏమన్నారంటే?

BRS Formation Day Celebrations : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

Grand Celebrations of BRS Formation Day at Telangana Bhavan

BRS Formation Day : బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాలను ఎగురవేశారు. కాగా.. తెలంగాణ భవన్‌లోనూ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read :  సిలిండర్ బుకింగ్స్‌లో భారీ మార్పులు.. కొత్త రూల్స్ వచ్చేశాయ్.. ఇక్కడ తెలుసుకోండి.. ధరలు పెరుగుతాయా?

పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. 14ఏళ్లపాటు తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ సాధించారని, ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. రెండున్నర యేండ్లుగా దుర్మార్గ, అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. భారతదేశ చరిత్రలోనే 25ఏళ్ల వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీలు కొన్ని మాత్రమే.. అందులో బీఆర్ఎస్ పార్టీ ఒకటని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పునరంకితం అవుతుందని, అరాచక కాంగ్రెస్ , బీజేపీ పాలన నుండి తెలంగాణను మళ్లీ పట్టాలు ఎక్కించడం కోసం పోరాటం చేస్తామని అన్నారు. కేసీఆర్ సైనికులుగా బలగంగా కలిసికట్టుగా కదం తొక్కుతామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్ కు కేసీఆర్ వస్తారని, నేతలకు దిశనిర్దేశం చేస్తారని కేటీఆర్ తెలిపారు. కవిత పార్టీ, ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు కేటీఆర్ ఇష్టపడలేదు.

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ ఇవాళ ఉదయం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుందని అన్నారు. బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఓ విప్లవం. స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ.. సిల్వర్ జూబ్లీ వేడుకను చేసుకొంటున్న సన్నివేశం! 25 వసంతాల మైలురాయిని అధిగమించిన మహోజ్వల లాంగ్ మార్చ్ అంటూ కేటీఆర్ రాసుకొచ్చారు. ట్వీట్‌కు కేసీఆర్ ఉద్యమం నాటి ఫొటోను జత చేశారు.

ఎప్పుడూ ప్రజల పక్షానే : హరీశ్ రావు

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఉధ్యమంలోనైనా, అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా.. ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుతున్న పార్టీ బీఆర్ఎస్ అని హరీశ్ రావు అన్నారు. పోరాటాల పునాధి మీద పుట్టి, ప్రజల విశ్వాసంతో ఎదిగి, ప్రతి గుండెలో నాటుకుపోయిన గులాబీ శక్తి బీఆర్ఎస్ అని తెలిపారు. పాపపు పాలనలో ప్రజలు నలిగిపోతున్న వేళ.. ప్రజల గుండెల్లో మార్మోగుతున్నది ఒకటే నినాదం.. సంక్షేమం అడుగంటి, అభివృద్ధి నిలిచిపోయి, అరాచకం తాండవం చేస్తున్న కాలంలో వినిపిస్తోంది ఒక్కటే స్వరమని.. అదే ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అని హరీశ్ రావు అన్నారు. గులాబీ జెండా సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదు. నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజు ఎంతో దూరంలో లేదని హరీశ్ రావు పేర్కొన్నారు.