Telangana Rain Alert : తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న 24 గంటల్లో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో మరింతగా నైరుతి రుతుపవనాలు విస్తరించడం, సముద్ర ఉష్ణోగ్రత, ఇతర వాతావరణ పరిస్థితులతో వానలు పడనున్నట్లు వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో 4-5 రోజుల్లో కేరళ, కర్నాటక తీరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. వాయువ్య, మధ్య భారత్ పై ఉష్ణగాలుల ప్రభావం తగ్గుముఖం పట్టనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
మరోవైపు దేశ ప్రజలకు భారత వాతవరణ శాఖ చల్లని కబురు చెప్పింది. సోమవారం అండమాన్ నికోబర్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ప్రకటించింది. దీంతో, 23 రోజుల ముందుగానే రుతుపవనాలు ప్రారంభమయ్యాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల రాకతో ఇటు జనాలు, అటు అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Weather Forecast: తెలంగాణలో నేడు మోస్తరు వర్షాలు.. రుతుపవనాల రాక ఎప్పుడంటే?
రుతుపవనాల రాకతో అండమాన్ నికోబర్ దీవులు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరోవైపు, రానున్న నాలుగు, ఐదు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, దక్షిణ కర్నాటక తీరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రుతుపవనాలు బలపడేందుకు సిద్ధంగా ఉన్నాయంది. మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో సోమవారం వానలు కురిశాయి. కర్నూలు, కడప, తిరుపతిలో వాన పడింది.
South West Monsoon : అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు.. దేశం మొత్తం ఇదే పరిస్థితి. ఎండవేడికి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఉక్కపోతతో విలవిలలాడిపోతున్నారు. ఈ మండు టెండల నుంచి ఎప్పుడెప్పుడు విముక్తి లభిస్తుందా? వర్షాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయా? అని జనాలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు చెప్పారు. రుతుపవనాలు ఎంటర్ అయిపోయాయని, ఇక వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు కొంత రిలాక్స్ అవుతున్నారు. తొలకరి పలకరింతతో పులకరించిపోతున్నారు.