Heavy Rains in Telangana : నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. రాగల నాలుగు రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యపేట, మహబూబాద్ జిల్లాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
బుధవారం నుంచి గురువారం వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వానలు పడనున్నాయని తెలిపింది.
శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీతోపాటు హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, యూపీ, హర్యానాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో పలు పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు చిక్కుకుపోయారు.
కులు-మనాలి, కసోల్, పార్వతి వ్యాలీలో యాత్రికులు చిక్కుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో రహదారులు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వంతెనలు కొట్టుకుపోయాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో రెండు వారాల్లో వర్షాల కారణంగా 100 మందికి పైగా మృతి చెందారు. గడిచిన రెండు రోజుల్లో 40 మందికి పైగా మృతి చెందారు. హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, యూపీ, హర్యానాలో మృతుల సంఖ్య పెరుగుతోంది.
IMD issues Red alert : హిమాచల్ ప్రదేశ్లో అతి భారీవర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
వరద నీటిలో భవనాలు, రోడ్లు, రైల్వే ట్రాక్లు కొట్టుకుపోయాయి. దీంతో ఎటూ కదల్లేని పరిస్థితుల్లో యాత్రికులు హోటళ్లలోనే ఉన్నారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యార్థులు కసోల్లో చిక్కుకున్నారు. విద్యార్థుల్లో తెలుగు విద్యార్థి వంగరి రాహుల్ కూడా ఉన్నారు. ఎవరి ఫోన్లూ పనిచేయకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.