Telangana High Court : తెలంగాణలో లాక్ డౌన్ పై ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు
తెలంగాణలో కరోనా కట్టడి చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణలో లాక్ డౌన్ పై ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు చేసింది.
- bheemraj
- Updated on- May 5, 2021 / 05:09 PM IST
High Court Key Instructions To Government On Lockdown In Telangana
High Court key instructions : తెలంగాణలో కరోనా కట్టడి చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణలో లాక్ డౌన్ పై ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు చేసింది. వీకెండ్ లాక్ డౌన్ పెట్టే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టు 24 గంటల్లో ఇవ్వాలని ఆదేశించింది. నైట్ కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది.
నైట్ కర్ఫ్యూ పెట్టినా కేసులు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించింది. తెలంగాణలో మెడికల్ సప్లై గురించి కూడా హైకోర్టు వివరాలు తెలుసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్స్ వివరాలను డిస్ ప్లే చేయాలని తెలిపింది.
రాష్ట్రంలోని కరోనా పరీక్షలు తగ్గించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా తీవ్రత పెరుగుతుంటే పరీక్షలు ఎందుకు తగ్గిస్తున్నారని ప్రశ్నించింది. అలాగే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారి వాహనాలను ఎందుకు సీజ్ చేయడం లేదని నిలదీసింది. బ్లాక్ మార్కెట్ పై పోలీసులు దృష్టి పెడుతున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది.
బ్లాక్ మార్కెట్ పై ప్రత్యేక నిఘా ఉంచామని హైకోర్టుకు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో బ్లాక్ మార్కెట్ పై నిఘా ఉంచామని వివరించారు. ఇప్పటివరకు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 39 మందిపై కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. అలాగే మాస్క్ లేని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నామని పేర్కొన్నారు.
