Kavitha Arrest
Kavitha Arrest : ఖమ్మం జిల్లాలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల వెలుగుమట్ల వద్ద భూముల్లో పేదల నివాసాలను అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read : Acid Rain In Iran : ఇరాన్ పై యాసిడ్ వర్షం.. ఇది జనం శరీరం మీద పడితే..
తాజాగా.. బాధితులకు అండగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆందోళనకు దిగారు. ఖమ్మం జెడ్పీ సెంటర్లో కవితతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, వెలుగుమట్ల బాధితులు ఆందోళనకు దిగారు. సుమారు రెండు గంటలపాటు అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించడంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు రంగంలోకిదిగి వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.
ఆందోళన కొనసాగిస్తున్న బాధితులు, నాయకులను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. నిరసనకారులను చెదరగొట్టిన పోలీసులు.. కవితతోపాటు పలువురు నాయకులను అరెస్టుచేసి బలవంతంగా అక్కడి నుంచి తరలించి వ్యాన్లో ఎక్కించారు. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే కవితతోపాటు పలువరు మహిళలను అరెస్టు చేయడం పట్ల పోలీసుల తీరుపై జాగృతి నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు కవిత మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ బాధితులకు ప్రభుత్వం అండగా లేదని విమర్శించారు. ప్రభుత్వం తరపున వారికి వైద్య సహాయం కూడా అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకూ ఆందోళన కొనసాగిస్తామని, ప్రభుత్వం వెంటనే దిగివచ్చి బాధితులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.