Telangana and AndhraPradesh : నాగార్జున సాగర్ లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. బుధవారం అర్థరాత్రి తరువాత మెయిన్ గేటు నుంచి ఏపీ పోలీసులు డ్యామ్ పైకి చొచ్చుకొనివచ్చి 13గేట్ల వరకు బారికేడ్లు, ఇనుప కంచె ఏర్పాటు చేసుకున్నారు. ప్రాజెక్టు అధికారులకు కనీసం సమాచారం ఇవ్వకుండా 5వ గేటు నుంచి 2000 క్యూసెక్కుల నీటిని కుడి కాలువకు ఏపీ అధికారులు వదిలారు. దీంతో గురువారం తెల్లవారుజాము నుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తెలంగాణలో పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఏపీ పోలీసులు ఇలా వ్యవహరించండం చర్చనీయాంశంగా మారింది. తాగునీటి అవసరాలకోసమే నీటిని కుడి కాలువ నుంచి విడుదల చేశామని ఏపీ పేర్కొంది.
Also Read : Telangana Exit Poll Result 2023 : తెలంగాణ ఎగ్జిట్ పోల్స్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..?
గురువారం తెల్లవారు జామున సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి డ్యామ్ పైకి చేరుకొని ఏపీ పోలీసులతో మాట్లాడారు. డ్యామ్ కు సంబంధించి నిర్వహణ విషయం నీటి పారుదలకు సంబంధించినదని, ముళ్లకంచెను తీసేయాలని ఏపీ పోలీసులకు సూచించారు. స్పందించక పోవడంతో తన సిబ్బందితో ఆయన వెనుదిరిగి వెళ్లారు. తెలంగాణలో పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలీసులు పోలింగ్ విధుల నిర్వహణలో నిమగ్నమయ్యారు. పోలింగ్ ముగియడంతో డ్యామ్ వద్దకు భారీగా తెలంగాణ పోలీస్ బలగాలు చేరుకుంటున్నాయి. అవసరం అయితే జేసీబీతో ఇనుప కంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమవుతున్నారు. జేసీబీని తీసుకొని తెలంగాణ పోలీసులు డ్యామ్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నాగార్జునసాగర్ వద్ద పరిస్థితిని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో డ్యాం వద్ద ఎలాంటి పరిస్థితులు తెలుత్తుతాయోననే ఉత్కంఠ నెలకొంది.