×
Ad

Surveillance On Social Media Posts : హైదరాబాద్‌ పోలీసులు అలర్ట్‌..సోషల్‌ మీడియా పోస్టులపై నిఘా

ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు... ఆ తర్వాత పరిణామాల తర్వాత హైదరాబాద్‌ పోలీసులు అలర్ట్‌గా ఉండటంతో ప్రస్తుతం పాతబస్తీలో ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది. నిన్న ప్రార్థనలు కూడా ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

  • Published On : August 27, 2022 / 06:09 PM IST

Surveillance On Social Media Posts

Surveillance On Social Media Posts : ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు… ఆ తర్వాత పరిణామాల తర్వాత హైదరాబాద్‌ పోలీసులు అలర్ట్‌గా ఉండటంతో ప్రస్తుతం పాతబస్తీలో ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది. నిన్న ప్రార్థనలు కూడా ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ.. ముస్లింలంతా శుక్రవారం ప్రార్థనల తర్వాత ఆందోళనలకు దిగుతారని అంతా ఊహించారు.

అల్లర్లు చెలరేగే ప్రమాదముందని.. పోలీసులు కూడా ముందుజాగ్రత్త చర్యగా.. ఓల్డ్ సిటీలో ఆంక్షలు విధించారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని కూడా ప్రకటించారు. అంతేకాదు.. అల్లర్లకు పాల్పడతారని.. హేట్ స్లోగన్స్ ఇస్తారనే అనుమానం కలిగిన యువకులను కూడా ముందుగానే అరెస్ట్ చేశారు.

Minister KTR : మతాల పేరుతో కొట్టుకు చావమని ఏ దేవుడు చెప్పాడు? మంత్రి కేటీఆర్ ఆగ్రహం

మతపరమైన అల్లర్లు చెలరేగుతాయనే ఆందోళనతో.. పాతబస్తీ మొత్తం పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఓల్డ్ సిటీ మొత్తం.. పోలీస్ పహారాలోనే కొనసాగుతోంది. శుక్రవారం.. చార్మినార్ పక్కనున్న మక్కా మసీదులో.. మధ్యాహ్నం ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు ఉండటంతో.. పోలీసులు మరింత నిఘా పెంచారు.

శాలిబండ, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, అలియాబాద్, మొగల్పురా, హుస్సేనీఆలం, పత్తర్‌ఘట్టి, మదీనా ప్రాంతాల్లో.. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దారుషిఫా, డబీర్‌పుర, మురిగి చౌక్, మీరాలం మండి, బేగం బజార్ ప్రాంతాల్లోనూ.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర పోలీసులు సోషల్‌ మీడియా పోస్టులపై నిఘా పెంచారు.