Tummala Nageswara Rao
Tummala Nageswara Rao : అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. గల్ప్ దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో దుబాయ్లోనూ పలు ప్రాంతాల్లో ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంను మూసివేశారు. విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు దుబాయ్లో చిక్కుకుపోయారు. వీరిలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల క్రితం దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరికి అకస్మాత్తుగా అనారోగ్యం కలగడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ఆయన దుబాయ్కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తుమ్మల, ఆయన కటుుంబ సభ్యులు తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ఆ ప్రభావం దుబాయ్పై పడింది.
ఇరాన్ దుబాయ్లోని పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో ఎయిర్పోర్టుపై కూడా దాడులు జరిగాయి. దీంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఎమిరేట్స్ సహా భారతీయ విమాన సంస్థలైన ఎయిర్ ఇండియా, ఇండిగో కూడా తమ సర్వీసులను రద్దు చేశాయి. దీంతో తుమ్మల, ఆయన కుటుంబ సభ్యులు దాబాయ్లో చిక్కుకుపోయారు.
ఎయిర్పోర్టు క్లియరెన్స్ వచ్చే వరకూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇండియాకు తిరిగిరాలేని పరిస్థితి. అయితే, ప్రస్తుతం దుబాయ్లో తుమ్మల, ఆయన కుటుంబ సభ్యులు సేఫ్గానే ఉన్నారు. రెండు రోజుల్లో విమాన సర్వీస్సులు రాకపోకలు ప్రారంభంకాగానే ఆయన హైదరాబాద్ తిరిగిరానున్నారు. అయితే, ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తున్న వేళ తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకుపోవడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.