Isolation In Cemetery
Isolation center in cemetery : తండాలో నివసిస్తున్న ప్రజలు భలే నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా శ్మశానాన్నే ఐసోలేషన్ గా మార్చేసుకున్నారు. తిండీ..నిద్రా అంతా అక్కడే. తండాలో కొంతమందికి కరోనా పాజిటివ్ రావటంతో అది మరింతమందికి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీని కోసం ఏకంగా శ్మశానంలోనే ఐసోలేషన్ గా మార్చేసుకుని అక్కడే ఉంటున్నారు. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం కిష్టంపల్లి తండావాసులందరూ కలిసి ఈ నిర్ణయం వారంతా కలిసి తీసుకున్నదే కావటంతో ఎటువంటి గొడవలు లేకుండా శ్మశానంలోనే ఉంటున్నారు కరోనా పాజిటివ్ వచ్చినవారు.
కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా కొత్తగా నిర్మించిన వైకుంఠధామాన్ని ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించుకోవాల ని నిర్ణయించారు. తండావాసులంతా మూకుమ్మడిగా నిర్ణయం తీసుకొని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. 360 మంది జనాభా ఉన్న ఈ తండాలో ఇద్దరికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో వాళ్లంతా కలిసి వైరస్ వాప్తి చెందితే.. మరింత ప్రమాదం ముంచుకొస్తుందని భావించారు. దీంతో అందరూ కోవిడ్ నిర్ణారణ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆరుగురు వైరస్ బారిన పడినట్లుగా తేలింది. అంతే..అది మరింతగా వ్యాప్తి చెందకుండా బాధ్యతగా వ్యవహరించారు. వీరందరూ ఆ వైకుంఠధామం (శ్మశానం)లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.
నాలుగు రోజులుగా అక్కడే ఐసోలేషన్లో ఉండగా.. మొదట్లో తండావాసులు బాధితులకు రెండు పూటలా భోజనం వండి తీసుకొచ్చి పెట్టేవారు. తరువాత రుద్రారానికి చెందిన యువత వీరికి ప్రతీరోజు ఆహారం తీసుకొచ్చి ఇస్తున్నారు. వారికి కావాల్సిన పోషకాహాన్ని తీసుకొచ్చి సమకూరుస్తున్నారు. వైకుంఠధామంలో ఉంటున్న పాజిటివ్ బాధితులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు కిష్టంపల్లి తండా సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు.