Jupally krishna rao – bhatti vikramarka : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వాడీ వేడీగా జరుగుతున్నాయి. పార్టీలు మారే నేతలు మంతనాలు చేస్తున్నారు. పార్టీ మార్పు అంటే మరి ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ లే గుర్తుకొచ్చేలా ఉన్నాయి తెలంగాణ రాజకీయాలు. మాజీ బీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లోకి చేరటానికి రెడీ అయ్యారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఇక జూపల్లి చేరికకు కూడా ముహూర్తం ఖరారు అయ్యింది. దీంట్లో భాగంగా జూపల్లి కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్లీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని భట్టి నివాసానికి వచ్చిన జూపల్లి కృష్ణారావు ఆయనతో పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పతనం తప్పదని, పతనం అంచున బీఆర్ఎస్ ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తప్పదన్నారు. బీఆర్ఎస్ నుంచి భారీగా కాంగ్రెస్ లోకి చేరికలు ఉంటాయన్నారు. దీని కోసం ఎంతోమంది గులాబీ నేతలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నియోజకవర్గాల నుంచి నేతలు సమావేశం కావడం జరిగిందని.. వారంతా కాంగ్రెస్లో చేరతారని తెలిపారు. కొల్లాపూర్లో జరిగే బహిరంగ సభకు ఆహ్వానించడం కోసం చర్చించేందుకు భట్టి వద్దకు వచ్చానని తెలిపారు.
భట్టి మాట్లాడుతు.. త్వరలో కొల్లాపూర్లో భారీ బహిరంగ సభతో తెలంగాణ సమాజానికి సందేశం ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు చేరికను స్వాగతిస్తున్నామని అన్నారు. జూపల్లి రాజకీయ అనుభవం కాంగ్రెస్ పార్టీకి ఉపయోపడుతుందని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆశలు నెరవేరాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.
ప్రధాని మోదీ మాటలతో మాయం చేస్తున్నారని.. మాటలు చెప్పే ప్రధాని మనకు అవసరమా? అని ప్రశ్నించారు. దేశానికి మాటలు చెప్పే ప్రధాని కాదు చేతల ప్రధాని కావాలన్నారు. కేసీఆర్ అవినీతిపరుడు అంటూ విమర్శించిన ప్రధాని మోదీ.. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవటంలేదని ప్రశ్నించారు. కొల్లాపూరులో జరిగే భారీ బహిరంగ సభకు ఏఐసీసీ పెద్దలు వస్తారని.. దానికి సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.