Kasani Gnaneshwar: రేవంత్ రెడ్డిపై కాసాని జ్ఞానేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Kasani Gnaneshwar: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించారు.
- Naga Srinivasa Rao Poduri
- Updated on- February 25, 2023 / 06:25 PM IST
Kasani Gnaneshwar: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించారు. శనివారం హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులతో జ్ఞానేశ్వర్ చిట్ చాట్ చేశారు. తెలుగుదేశం పార్టీని తల్లిగారి పార్టీ అంటున్న రేవంత్ రెడ్డి టీడీపీలోకి రావాలని ఈ సందర్భంగా అన్నారు. కాగా, రేవంత్ రెడ్డి.. టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి గుర్తుండే ఉంటుంది.
తెలంగాణలో తెలుగు దేశం పార్టీని బలోపేతం చేస్తామని.. ఇందులో భాగంగా పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు. రేపటి (ఫిబ్రవరి 26) నుంచి ఇంటి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర నిర్వహిస్తామన్నారు.
Also Read: ప్రజల డబ్బులతో కేంద్రం ఆటలా? అదానీ వ్యవహారంపై కేంద్రానికి కల్వకుంట్ల కవిత ప్రశ్నల వర్షం
పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో పార్టీ తరపున పరిశీకుల నియామకం త్వరలోనే చేపడతామన్నారు. త్వరలోనే రాష్ట్రస్థాయి కమిటీ వేయబోతున్నామని, పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్లకు అన్యాయం జరగదని భరోసాయిచ్చారు. తమ పార్టీ తరపున పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థులు కోటీశ్వరులు కాదని.. కార్యకర్తలు, పేదలే ఉంటారని కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు. కాగా, నాయీ బ్రాహ్మణులకు మొట్ట మొదటగా ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామని ఆయన గతంలో ప్రకటించారు.
