Komatireddy Raj Gopal Reddy
Komatireddy Raj Gopal Reddy – BJP: బీజేపీ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay)ను చూస్తుంటే తన కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. హైదరాబాద్ (Hyderabad) నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్వహించిన సభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు.
బండి సంజయ్ ఉన్నతమైన స్థానంలో ఉండాలని తాను కోరుకుంటున్నట్లు రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఆయన వల్లే బీజేపీ రాష్ట్రంలో బలపడిందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు దుబ్బాక, హుజూరాబాద్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బండి సంజయ్ నేతృత్వంలోనే బీజేపీ గెలుపొందిందని చెప్పారు.
మునుగోడులో బీజేపీని ఓడించడానికి సీఎం కేసీఆర్ 100 మంది కౌరవులను పంపించారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కొందరు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని అంటున్నారని, అది సరికాదని చెప్పారు. తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలోనూ అవే ఫలితాలు వస్తాయని అనుకుంటున్నారని చెప్పారు.
కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఉన్నారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తాను పార్టీ మారబోనని అన్నారు. తాను బీజేపీలో చేరింది బీఆర్ఎస్ పై పోరాటం చేయడానికేనని స్పష్టం చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి మచ్చ లేని నాయకుడని అన్నారు.