KTR: 2028 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు.. జిందాల్ వర్సిటీ విద్యార్థుల ప్రశ్న.. క్లారిటీ ఇచ్చిన కేటీఆర్
తెలంగాణ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో తమ పార్టీ పొత్తుపై కేటీఆర్(KTR) క్లారిటీ ఇచ్చారు.
- V Santhosh Kumar
- Updated on- September 16, 2026 / 09:55 PM IST
ktr rules out brs bjp alliance for 2028 telangana assembly elections
- బీజేపీతో పొత్తు లేదు
- డీలిమిటేషన్పై కీలక వ్యాఖ్యలు
- కాళేశ్వరం ఇంజినీరింగ్ అద్భుతం
KTR: తెలంగాణలో రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో తమ పార్టీ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)స్పష్టం చేశారు. హర్యానాలోని జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో “ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్: ది స్టోరీ ఆఫ్ ఎ స్టార్టప్ స్టేట్” అనే అంశంపై ఆయన ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో రాబోయే రాజకీయ సమీకరణలు, డీలిమిటేషన్, ఏఐ సాంకేతికతపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
డీలిమిటేషన్, ఏఐ సాంకేతికతపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు:
లోక్సభ స్థానాల పునర్విభజనపై కేటీఆర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా దామాషా ప్రకారం స్థానాలను పెంచితే డీలిమిటేషన్కు మద్దతు ఇస్తామని వెల్లడించారు. ప్రస్తుతం లోక్సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం ప్రాతినిధ్యం ఉందన్న ఆయన, తమ హక్కులకు భంగం కలగకుండా చూస్తే మద్దతుకు అభ్యంతరం లేదన్నారు. కృత్రిమ మేధ (AI) రాకపై స్పందిస్తూ.. ప్రతి సాంకేతిక పరివర్తనలోనూ ఆందోళనలు సాధారణమేనని, ఏఐని వ్యతిరేకించకుండా స్వీకరించి ముందుకు సాగాలని సూచించారు.
తెలంగాణ ప్రగతి, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత:
కేటీఆర్ తన ప్రసంగంలో తెలంగాణ సాధించిన విప్లవాత్మక అభివృద్ధిని వివరించారు. రాష్ట్రంలో కరవు ప్రాంతాలకు నీరందించిన ఇంజినీరింగ్ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు అని అభివర్ణించారు. 2014-15లో తెలంగాణలో కేవలం 44.4 లక్షల టన్నులుగా ఉన్న వరి ధాన్యం ఉత్పత్తి, BRS పాలనలోని వ్యూహాత్మక సంక్షేమ పథకాల వల్ల 2023-24 నాటికి ఏకంగా 168.8 లక్షల టన్నులకు పెరిగిందని గణాంకాలతో వివరించారు.
