KTR: ఇక కదలాలి.. వచ్చే ఎన్నికలకు గులాబీ సైన్యం సమరోత్సాహంతో కదంతొక్కాలి: కేటీఆర్
KTR: బీఆర్ఎస్ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలని తెలిపారు. ఈ నెల 25న జరగబోయే ప్రతినిధుల సభలు వచ్చే ఎన్నికలకు బలమైన పునాదిరాళ్లని అన్నారు.
- T Venkateshwarlu
- Published On : April 23, 2023 / 07:36 PM IST
KTR
KTR: తెలంగాణలో వచ్చే ఎన్నికలకు గులాబీ సైన్యం సమరోత్సాహంతో కదంతొక్కాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతలతో మంత్రి కేటీఆర్ ఇవాళ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతిష్ఠాత్మకంగా బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలు నిర్వహించాలని చెప్పారు.
బీఆర్ఎస్ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలని తెలిపారు. ఈ నెల 25న జరగబోయే ప్రతినిధుల సభలు వచ్చే ఎన్నికలకు బలమైన పునాదిరాళ్లని అన్నారు. తొమ్మిదేళ్లలో మారిన తెలంగాణ ముఖచిత్రంపై సభల్లో తీర్మానాలు చేయండని సూచించారు. దేశంలో కేసీఆర్ అంటే సంక్షేమం… మోదీ అంటే సంక్షోభం అని చెప్పారు.
“మన ప్రియమైన ముఖ్యమంత్రికి, దేశ ప్రజలకు పిరమైన ప్రధానికి మధ్య వ్యత్యాసాన్ని వివరించండి. మోదీ అంటేనే మొండిచెయ్యి అనే విషయం.. ప్రతి గడపకు చేరాలి, ప్రతిగుండెను తట్టాలి. నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల సభలో కనీసం 6 తీర్మానాలు చేయాలి. వ్యవసాయం, సంక్షేమం, పల్లె ప్రగతి- పట్టణ ప్రగతి, విద్య- ఉపాధి, బీజేపీ వైఫల్యాలు, స్థానిక అంశాలపై తీర్మానాలు చేయాలి” అని కేటీఆర్ చెప్పారు.
ప్రతినిధుల సభలో చేసే తీర్మానాలు ప్రజలను ఆలోచింపజేసేలా ఉండాలని చెప్పారు. నియోజకవర్గ ప్రతినిధుల సభల ద్వారా సుమారు నాలుగు లక్షల మంది పార్టీ శ్రేణులకు అన్ని కీలక అంశాలపైన రాజకీయంగా దిశానిర్దేశం చేసేలా ప్రణాళిక సిద్ధంచేసుకోవాలని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రానికి మోదీ చేసిన మోసాలు, బీజేపీ చేసిన అన్యాయాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయండని చెప్పారు.
BJP-Chevella: తెలంగాణలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి.. ఈ రెండు ఉచితంగా ఇచ్చేస్తాం: బండి సంజయ్
