పటాన్‌చెరులోని పారిశ్రామికవాడలో భారీ పేలుడు.. ఆరుగురు కార్మికులు మృతి.. మరికొందరికి తీవ్ర గాయాలు..

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పటాన్‌చెరు మండలం పాశ‌మైలానం పారిశ్రామికవాడలో..

Sangareddy District: సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పటాన్‌చెరు మండలం పాశ‌మైలానం పారిశ్రామికవాడలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సీగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్ట్ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Also Read: Heatattack : విషాదం.. సిక్స్ కొట్టి గుండెపోటుతో పిచ్ మ‌ధ్య‌లోనే బ్యాట‌ర్ మృతి..

భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఐదుగురు కార్మికులు ప్రమాద స్థలిలో మృతిచెందగా.. ఓ కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరికొందరు కార్మికులకు తీవ్రంగా గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం చందానగర్, ఇస్నాపూర్ లోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. పేలుడు ధాటికి పలువురు కార్మికులు కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడినట్లు స్థానికులు తెలిపారు. పేలుడు ధాటికి పరిశ్రమకు సంబంధించిన షెడ్డు కూలిపోగా.. పక్కనే ఉన్న మరో భవనానికి బీటలు ఏర్పడ్డాయి.

మరోవైపు.. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ వెళ్లి పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. 11 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు పరిశ్రమ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి.