Katakam Sudarshan : మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ గుండెపోటుతో మృతి
రెండేళ్ల క్రితం ఛత్తీస్ గఢ్ లోని దంతేవాడలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన మావోయిస్టుల దాడిలో సుదర్శన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 70 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.
- bheemraj
- Published On : June 4, 2023 / 12:51 PM IST
Katakam Sudarshan
Katakam Sudarshan Heart Attack : మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ మృతి చెందారు. మే31న గుండె పోటుతో ఆయన మరణించినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. కటకం సుదర్శన్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని కన్నాలబస్తి. వరంగల్ లో పాలిటెక్నిక్ చదివిన ఆయన కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్శితులయ్యారు.
దీంతో 1980లో ఆయన మావోయిస్టు ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి సుదర్శన్ అజ్ఞాతంలోనే ఉన్నారు. మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన సుదర్శన్.. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఆయనను ఆనంద్, మోహన్, వీరేందర్ జీ అనే వివిధ పేర్లతో పిలుస్తారు. సుదర్శన్ పై హత్య కేసు సహా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో మొత్తం 17 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
రెండేళ్ల క్రితం ఛత్తీస్ గఢ్ లోని దంతేవాడలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన మావోయిస్టుల దాడిలో సుదర్శన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 70 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. కాగా, మే28న ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ నాయకులపై జరిగిన దాడికి పథకం రచన చేసిందని సుదర్శన్ అని పోలీసులు అనుమానిస్తున్నారు.
గత మూడు దశాబ్ధాలుగా ఆయన ఉతర తెలంగాణ నుంచి ఛత్తీస్ గఢ్ లోని దండకారణ్యంలో ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఆయన సతీమణి, మావోయిస్టు నాయకురాలు సాధన గత కొన్నేళ్ల క్రితం జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందారు.
