Telangana: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి తప్పిన ప్రమాదం
తెలంగాణ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి తృటిలో ప్రమాదం తప్పింది.
- Harishth Thanniru
- Updated on- July 17, 2025 / 12:39 PM IST
Minister Vivek Venkataswamy
Telangana: తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి తృటిలో ప్రమాదం తప్పింది. ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి హోదాలో ఆయన ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురువారం ఉదయం నర్సాపూర్కు వెళ్తున్న సమయంలో మంత్రికి ప్రమాదం తప్పింది.
మంత్రి కాన్వాయ్ ముందు వెళ్తున్న ఓ కారును సడెన్ బ్రేక్ వేయడంతో నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో ఓ కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు.
మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఉదయం జిన్నారం మండలంలోని గుమ్మడిదల గ్రామాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతిష్టించబడిన భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించిన మంత్రి.. డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే సమాజ మార్పు సాధ్యమవుతుందని అన్నారు. ఆయన దారిలో నడవడమే సనాతన సమాజాన్ని సమానత్వ మార్గంలో తీసుకెళ్లే మార్గమని పేర్కొన్నారు.
