హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు గంట, రెండు గంటల్లో విజయవాడ, నాలుగు గంటల్లో బెంగళూరుకు చేరుకొనే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది. అబ్బా ఎంతో సౌకర్యంగా ఉంటుందని అంటారు కదా. అవును తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడ ఇలానే అన్నారు.
రాష్ట్రంలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లు రావాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే…హైదరాబాద్ లో పని చేసే వ్యక్తి ఇక్కడే నివాసం ఉండాల్సినవసరం ఉండదన్నారు. హై స్పీడ్ రైల్ నెట్ వర్క్ తో అద్బుతాలు జరగవచ్చన్నారు.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం, కొండకల్ గ్రామంలో మేధా సర్వోడ్రైవ్స్ కంపెనీ ఆధ్వర్యంలో రైల్వే కోచ్ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
మేధా సంస్థ వల్ల తెలంగాణకు రైల్వే ఫ్యాక్టరీ వచ్చిందని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మేధా సంస్థ 2005లో రూ.25 కోట్ల పెట్టుబడితో ప్రారంభమై 15 ఏండ్లకాలంలో 12 ఫ్యాక్టరీలతో నాలుగైదు ఖండాలలో విస్తరించిందని చెప్పారు.
కొండకల్లో స్థాపించనున్న ఈ పరిశ్రమ కోసం TSAIC ఇప్పటికే రైతుల నుంచి 100 ఎకరాల స్థలాన్ని సేకరించిందని, సుమారు రూ.800 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. మరో 18 నెలల్లోనే ఫస్ట్ ఉత్పత్తి, యూనిట్, మొదటి కోచ్ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.