×
Ad

Telangana Municipal Election Results 2026: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఈ మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఫుల్ డిమాండ్

జమ్మికుంటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థులను క్యాంప్ నకు తరలించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. స్వతంత్ర అభ్యర్థులను కారులో తరలిస్తుండగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు.

  • Published On : February 13, 2026 / 06:56 PM IST

Hung Municipalities Representative Image (Image Credit To Original Source)

  • 16 మున్సిపాలిటీల్లో హంగ్..!
  • కీలకంగా మారిన ఇండిపెండెంట్ విజేతలు
  • స్వతంత్ర విజేతలను తమవైపు తిప్పుకునేందుకు పార్టీల ప్రయత్నాలు

 

Telangana Municipal Election Results 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. చాలా మున్సిపాలిటీల్లో ఫలితాలు తేలిపోయాయి. కొన్నింటిలో హంగ్ ఏర్పడింది. దేవరకద్ర, అలంపూర్, కోహిర్, కె సముద్రం, ఆసిఫాబాద్, అమరచింత, క్యాతనపల్లి, జనగామ, జిన్నారం, జమ్మికుంట, వేములవాడ, రాయికల్, ఆలియాబాద్, గద్వాల్, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు చక్రం తిప్పుతున్నారు. ఆ ప్రాంతాల్లో వాళ్లే ఇప్పుడు కీలకం అయ్యారు. స్వతంత్ర అభ్యర్థులను తమవైపు తిప్పుకోవడానికి రాజకీయ పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇండిపెండెంట్ విజేతలను క్యాంప్ లకు తరలిస్తున్నాయి.

జమ్మికుంటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థులను క్యాంప్ నకు తరలించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. స్వతంత్ర అభ్యర్థులను కారులో తరలిస్తుండగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. జమ్మికుంట మున్సిపాలిటీలోని 30వ వార్డుల్లో బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, ఏఐఎఫ్ బీ 1, ఇండిపెండెంట్స్ 3 స్థానాలు గెలుచుకున్నాయి. మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది.

జనగామ మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ 13 వార్డులు, కాంగ్రెస్ 12 వార్డులు, సీపీఎం ఒక వార్డు గెలుచుకున్నాయి. స్వతంత్రులు నాలుగు స్థానాల్లో సత్తా చాటారు. ప్రధాన పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలంటే స్వతంత్రులు కీలకమయ్యారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నాయి. పాండు అనే 15వ వార్డు స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చుట్టుముట్టారు. కౌంటింగ్ కేంద్రం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కారులో తీసుకెళ్లారు.

ఇక జహీరాబాద్ మున్సిపాలిటీలో ఇంట్రస్టింగ్ రిజల్ట్స్ వచ్చాయి. బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ నుంచి ముగ్గురు, ఎంఐఎం నుంచి ఇద్దరు గెలిచారు. కాగా, ఈ స్థానంలో గెలిచిన ముగ్గురు స్వతంత్రుల ఓట్లు కీలకమయ్యాయి. ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది కాంగ్రెస్. ఈ స్థానంలో గెలిచిన ముగ్గురు ఇండిపెండెంట్లలో ఇద్దరు ఎంఐఎం కౌన్సిలర్లు. వారితో మంతనాలు మొదలుపెట్టింది. ఈ స్థానంలో ఎక్స్ అఫీషియో మెంబర్ల ఓట్లు కూడా కీలకం కానున్నాయి.

Also Read: హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో మా స్టాండ్ ఇదే.. తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు