Muthireddy Yadagiri: కన్నీరు ఆపుకోలేకపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. ఎన్నికల్లో పోటీకి ఇక టికెట్..
సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట.. పల్లా రాజేశ్వర్ కుట్రలు ఎందుకు చేస్తున్నారని ముత్తిరెడ్డి అడిగారు.
- T Venkateshwarlu
- Published On : August 19, 2023 / 04:31 PM IST
Muthireddy Yadagiri
Muthireddy Yadagiri – breaks down: బీఆర్ఎస్ (BRS) కార్యకర్తల ముందే కన్నీరు కార్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. తెలంగాణ(Telangana)లోని జనగామలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న వేళ జనగామ నుంచి బీఆర్ఎస్ టికెట్ కోసం మరో ఇద్దరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిపై ముత్తిరెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ అధిష్ఠానం ఏది చెబితే అదే చేస్తానని అన్నారు. తమ పార్టీ అధినేత తనకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందని చెప్పారు. తన నియోజక వర్గంలోని పరిస్థితిని కేసీఆర్ గమనిస్తున్నారని అన్నారు. జనగామకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు.
ఇప్పటివరకు టిక్కెట్లను ప్రకటించలేదని అన్నారు. అయినప్పటికీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి టికెట్ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. ఆయనకే టికెట్ దక్కిందని కార్యకర్తలను తికమకపెడుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న నేతలు ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. పల్లా వెంట కేవలం ముగ్గురు నాయకులు మాత్రమే ఉన్నారని చెప్పారు.
ఎవరు సమర్థులో, ఎవరు అసమర్థులో కేసీఆర్ కు తెలుసని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పాత్ర ఏంటని నిలదీశారు. బీఆర్ఎస్ విడుదల చేసే అభ్యర్థుల మొదటి జాబితాలో తన పేరు ఉంటుందని కార్యకర్తలు ఆశాభావంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట.. పల్లా రాజేశ్వర్ కుట్రలు ఎందుకు చేస్తున్నారని అడిగారు.
అలాగే, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సంస్కారానికి నమస్కారం అని వ్యాఖ్యానించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎందుకు డబ్బులు పంచుతూ కార్యకర్తల్లో టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నారని ముత్తిరెడ్డి ప్రశ్నించారు. తన బిడ్డను, అల్లుడిని రెచ్చగొట్టి తన కుటుంబంలో చిచ్చుపెట్టిన పాపం ఆయనదేనని అన్నారు.
Nitin Gadkari: అవినీతి నేతలు పార్టీలో చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి
