Telangana Scheme : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ అదిరిపోయే శుభవార్త.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..
Telangana Scheme : ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీసీఎంఎఫ్సీ) 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్వయం ఉపాధి పథకాలకోసం ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.
- Harish Thanniru
- Updated on- July 4, 2026 / 03:44 PM IST
Telangana Christian Minorities Scheme for Sewing Machines Bikes and Scooties
Telangana Govt Scheme: తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. మహిళలు, యువత ఆర్థిక సాధికారత సాధించేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. తాజాగా.. మరో కొత్త పథకాన్ని సర్కార్ ప్రారంభించేందుకు సిద్ధమైంది. తెలంగాణలోని క్రిస్టియన్ మైనారిటీ మహిళలు, యువత స్వయం ఉపాధి సాధించేలా ఈ పథకం ద్వారా ప్రభుత్వం చేయూతనివ్వనుంది.
తెలంగాణ రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనార్టీల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీసీఎంఎఫ్సీ) 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్వయం ఉపాధి పథకాలకోసం ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.
ఈ పథకం ద్వారా కుట్టు మిషన్లు, చిన్న వ్యాపార యూనిట్లు, పెట్టీ బిజినెస్లు, ఈ బైక్లు, ఈ – స్కూటీలు, మోటార్ బైక్లకోసం ఆర్థిక సహాయం అందించనున్నారు. మైనార్టీ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ తాజాగా ఓబీఎంఎంఎస్ పోర్టల్ను ప్రారంభించారు. ఈ పథకం కింద లబ్ధిపొందాలనుకునేవారు జులై 18వ తేదీ సాయంత్రం 5గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పథకం వివరాలు ఇవే..
- కుట్టు మిషన్లు, చిన్న వ్యాపార యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- ఈ-బైక్, ఈ-స్కూటీ, మోటార్ బైక్ యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2లక్షలలోపు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలలోపు ఉండాలి.
- వయస్సు, విద్యార్హతలు, ఇతర నిబంధనల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
- అభ్యర్థులు అధికారిక ఓబీఎంఎంఎస్ పోర్టల్ tsobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
- పోర్టల్ సందర్శన సమయంలో సాంకేతిక సమస్యలు, ఇతర సందేహాలు నివృతి కోసం 040-23391067 నంబర్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
- అర్హులైన క్రిస్టియన్ మైనారిటీ అభ్యర్థులు గడువులోపు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ స్వయం ఉపాధి పథకాల ప్రయోజనాలను పొందాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
