Pawan Kalyan : ‘మీ అయ్య జాగీరా‘ అని అందుకే అన్నా.. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చాకే విద్వేషాలు.. బీఆర్ఎస్ హయాంలో ఇలాలేదు..
Pawan Kalyan : జనసేన పార్టీ పెట్టిందే తెలంగాణ గడ్డపైన. తెలంగాణలో లక్షన్నర మంది సభ్యత్వం జనసేనకు ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. వాళ్లు ఉత్సాహంగా ఉన్నప్పుడు వారికోసం పనిచేయొద్దా..? అంటూ పవన్ ప్రశ్నించారు.
- Harish Thanniru
- Updated on- June 10, 2026 / 08:10 PM IST
Pawan Kalyan
Pawan Kalyan : తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వేదికగా నేషనల్ మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడారు.. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణకు పవన్ కల్యాణ్ రావొద్దంటూ కాంగ్రెస్ నేతలతోపాటు కొందరు తెలంగాణ పాలకులు చేసిన వ్యాఖ్యలపై మరోసారి పవన్ కల్యాణ్ ఈ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ మీ అయ్య జాగీరా అని ఎందుకు అనాల్సి వచ్చిందో పవన్ క్లారిటీ ఇచ్చారు.
Also Read : PM Narendra Modi : ఎన్డీయే ప్రభుత్వం 12ఏళ్ల పాలన పూర్తి.. మోదీ సర్కార్ సాధించిన ఘనతలివే..
జనసేన పార్టీ పెట్టిందే తెలంగాణ గడ్డపైన. తెలంగాణలో లక్షన్నర మంది సభ్యత్వం జనసేనకు ఉందని పవన్ అన్నారు. వాళ్లు ఉత్సాహంగా ఉన్నప్పుడు వారికోసం పనిచేయొద్దా..? అంటూ పవన్ ప్రశ్నించారు. తెలంగాణలో తమ పార్టీకి లీడర్స్ ఉన్నారు.. కేడర్ ఉంది కదా.. మా పార్టీని విస్తరించుకోవటంలో తప్పేంటని అన్నారు.
నాకు తెలంగాణలో పోటీ చేయాలని లేదు. తెలంగాణలో నా పార్టీని బలోపేతం చేసుకోవాలి. జనసేనను బలోపేతం చేసుకోవడం నా ప్రాథమిక హక్కు అని పవన్ అన్నారు. మీరు తెలంగాణలో అడుగు పెట్టొద్దంటూ గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడూ అనలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయని పవన్ అన్నారు. విభజనవాదం దేశానికి మంచిది కాదు.. 570కిపైగా సంస్థానాలను కష్టపడి విలీనం చేస్తే దేశం ఇలా ఉంది. నేను హైదరాబాద్ రాకూడదని కొందరు నేతలు అంటున్నారు.. అలా అయితే, రాహుల్ గాంధీకి దక్షిణాదితో సంబంధం లేదని చెప్పాల్సి ఉంటుంది. రాజకీయాలు మారాలని, ప్రాంతీయ వివక్ష, విధ్వంసకర ధోరణి ఉండకూడదని యువత కోరుకుంటోందన్న పవన్.. హేతుబద్దత ఉండే నాయకులే యువతకు కావాలి.. తమ సమస్యలు తెలుసుకొని, పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు.
కాంగ్రెస్ నేతలు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. నువ్వు తెలంగాణలో అడుగు పెట్టొద్దని అన్నారు.. నీ పార్టీని తెలంగాణలో విస్తరించొద్దు అని అంటున్నారు. తెలంగాణ నా మదర్ ల్యాండ్, నన్ను రావొద్దంటే ఎలా అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణలోకి ఎలా వస్తావంటూ నన్ను ప్రశ్నించారు. ఈ దేశం నాది.. ఎక్కడికైనా వెళ్లవచ్చనే ఉద్దేశంతోనే ‘తెలంగాణ మీ అయ్య జాగీర్ కాదని’ అనాల్సి వచ్చిందని పేర్కొన్న పవన్.. తెలంగాణలోకి రావాలంటే ఎవరి అనుమతి అక్కర్లేదని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర విభజనకు కాదని.. విభజన జరిగిన తీరుకు తాను వ్యతిరేకమని పవన్ కల్యాణ్ చెప్పారు. తెలంగాణలోకి తనను రావొద్దనడం తన ప్రాథమిక హక్కుకు భంగం కలిగించినట్లేనని పేర్కొన్నారు. కర్ణాటక, తమిళనాడులో ఉన్నవారి కోసం ఏమైనా చేయాలి కదా అని చెప్పుకొచ్చారు.
