వైఎస్ షర్మిల పార్టీ పై స్పందించిన పవన్ కళ్యాణ్
- Naveen
- Published On : February 10, 2021 / 05:43 PM IST
pawan kalyan reaction on sharmila party: తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ కొత్త పార్టీ(వైఎస్ఆర్ తెలంగాణ) పెట్టబోతున్నట్టు వైఎస్ షర్మిల చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఒక్కో పార్టీ నేత ఒక్కో రకంగా స్పందించారు. కొందరు వెల్ కమ్ చెబితే మరికొందరు తెలంగాణలో సమైక్యవాదులకు ఏం పని అని ప్రశ్నిస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలను స్వాగతించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఆంధ్రలో రాజకీయం చేసుకోవాలని మరికొందరు సలహా ఇచ్చారు. కాగా, తెలంగాణలో పార్టీ పెట్టాలనే నిర్ణయం షర్మిలదని, జగన్ కు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నేతలు అంటున్నారు.
తాజాగా ఈ వ్యవహారంపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. ఢిల్లీలో అమిత్ షాని కలిసి పలు అంశాలపై చర్చించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు షర్మిల పార్టీ గురించి పవన్ ని అడిగారు. ఇంకా పార్టీ ఫామ్ చెయ్యలేదన్న పవన్, విధివిధానాలు వచ్చాక మాట్లాడతానని చెప్పారు. కాగా, రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చని, అందరికీ హక్కు ఉందని, కొత్త వాళ్లు రావాలని తాను కోరుకుంటానని పవన్ చెప్పారు.
