PM Modi Telangana Tour : తెలంగాణలో ప్రధాని మోదీ మూడ్రోజుల పర్యటన.. ఇవాళ మల్కాజిగిరిలో రోడ్ షో.. పూర్తి షెడ్యూల్ ఇలా..
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 15, 16, 18 తేదీల్లో మోదీ పలు ప్రాంతాల్లో ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు.
- Harishth Thanniru
- Published On : March 15, 2024 / 07:21 AM IST
PM Modi
PM Modi Lok Sabha Election Campaign : ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 15, 16, 18 తేదీల్లో మోదీ పలు ప్రాంతాల్లో ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు. శుక్రవారం హైదరాబాద్ రానున్న మోదీ.. బీజేపీ అభ్యర్థి విజయాన్ని కాక్షిస్తూ మల్కాజిగిరి లోక్ సభ స్థానం పరిధిలో రోడ్ షోలో పాల్గొంటారు. మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్ రోడ్డు వరకు దాదాపు 1.2 కిలో మీటర్ల మేర దాదాపు గంటసేపు ప్రధాని రోడ్ షో కొనసాగనుంది. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ లోక్ సభ స్థానాలు అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాగర్ కర్నూల్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సోమవారం కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి లోక్ సభ స్థానాల అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు.
Also Read : Pawan Kalyan : నేను పోటీ చేసేది అక్కడి నుంచే..! స్వయంగా పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం దృష్టిసారించింది. రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకుగాను.. బీజేపీ అధిష్టానం రెండు దఫాల్లో విడుదల చేసిన జాబితాలో 15 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కేంద్ర పార్టీ పెద్దలు ప్రచారంలో పాల్గోనున్నారు. ఈ క్రమంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ మల్కాజిగిరి నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గోనున్నారు. ఇప్పటికే ఈనెల ప్రారంభంలో మోదీ తెలంగాణలో రెండు రోజులు పర్యటించారు. రాష్ట్ర బీజేపీ నిర్వహించిన సభల్లో పాల్గొని ప్రసంగించారు. కేంద్ర మంత్రి అమిత్ షాకూడా తెలంగాణలో పర్యటించి రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. మరోసారి మూడ్రోజులు ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటనకు రానున్నారు. బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ బహిరంగ సభలు, రోడ్ షోలలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
Also Read : CM Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి తలకు తీవ్ర గాయం.. ఆస్పత్రిలో చికిత్స!
- మోదీ రెండు రోజుల షెడ్యూల్ ఇలా..
శుక్రవారం సాయంత్రం 4.50 గంటలకు కేరళ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
రోడ్డు మార్గంలో మల్కాజిగిరి ప్రాంతానికి చేరుకుంటారు.
సాయంత్రం 5.15 గంటల నుంచి 6.15 గంటల వరకు మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించే రోడ్ షోలో మోదీ పాల్గొంటారు.
సాయంత్రం 6.40 గంటలకు రాజ్ భవన్ కు చేరుకుంటారు.
శుక్రవారం రాత్రి రాజ్ భవన్ లోనే ప్రధాని మోదీ బస చేస్తారు.
శనివారం ఉదయం 10.45 గంటలకు రాజ్ భవన్ నుంచి బేగంపేట విమనాశ్రయానికి మోదీ చేరుకుంటారు.
ఉదయం 11గంటలకు హెలికాప్టర్ లో విమానాశ్రయం నుంచి బయలుదేరి నాగర్ కర్నూల్ వెళ్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ లోక్ సభ నియోజక వర్గాల బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు.
12.45 గంటల వరకు బహిరంగ సభలో మోదీ ఉంటారు.
బహిరంగ సభ పూర్తయిన తరువాత హెలికాప్టర్ లో కర్ణాటక రాష్ట్రం కలబురిగికి ప్రధాని మోదీ వెళ్తారు.
ఈనెల 18న మోదీ జగిత్యాల బహిరంగ సభలో పాల్గొంటారు.
