Pm Modi : కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌లో అనేకసార్లు బాంబు పేలుళ్లు జరిగాయి- ప్రధాని మోదీ

జూన్ 4న దేశద్రోహులు ఓడిపోతారు. జూన్ 4న సీఏఏను వ్యతిరేకించే వారు ఓడిపోతారు.

Pm Modi : కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ లో అనేకసార్లు బాంబు పేలుళ్లు జరిగాయని ప్రధాని మోదీ అన్నారు. ఎంతోమంది అమాయకులు కాంగ్రెస్ పాలనలో బలయ్యారని వాపోయారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఆగిపోయాయని ప్రధాని అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు.

‘హైదరాబాద్ తో నాకు ఎంతో అనుబంధం ఉంది. పదేళ్ల క్రితం నా సభకు టికెట్లు కొనుక్కొని మరీ వచ్చారు. బీజేపీ, ఎన్డీయేకు ఓటు వేయడం ద్వారా దేశం సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతోంది. బుజ్జగింపు రాజకీయాలు, కుటంబపాలన కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ లో అనేకసార్లు బాంబు పేలుళ్లు జరిగాయి. ఎంతో మంది అమాయకులు బలయ్యారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ లను తెలంగాణ వద్దంటోంది. జూన్ 4న దేశద్రోహులు ఓడిపోతారు. జూన్ 4న సీఏఏను వ్యతిరేకించే వారు ఓడిపోతారు. జూన్ 4న ఆర్టికల్ 370ని తొలగించడాన్ని తప్పు పట్టేవారు ఓడిపోతారు. జూన్ 4న దేశాభివృద్ధిని వ్యతిరేకించే వారు ఓడిపోతారు” అని ప్రధాని మోదీ అన్నారు.

”భారత ఉజ్వల భవిష్యత్ కోసం మీ కమిట్ మెంట్ ఎంతో స్పెషల్. హైదరాబాద్ మరెంతో ప్రత్యేకం. మరీ ప్రత్యేకంగా ఈ వేదిక ఇంకా ప్రత్యేకం. పదేళ్ల క్రితం ఇక్కడే ఒక సభ పెట్టాను. ఆ సభకు టికెట్ పెట్టాం. ఈ సభ ఒక టర్నింగ్ పాయింట్ అయ్యింది. దేశంలోని నిరాశకు కూడా ఆశ చిగురించింది.
తెలంగాణ ప్రజల మూడ్ ఏంటనేది ఇప్పుడు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంను వద్దనుకుంటున్నారు. జూన్ 4 తర్వాత ఏం జరుగుతుందనేది నాకు స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ 4 తర్వాత 140 కోట్ల ప్రజలు విజయాన్ని సాధిస్తారు. దేశ విరోధులు మాత్రం ఓడిపోతారు. సీఏఏ, యూనిఫాం సివిల్ కోడ్, ట్రిపుల్ తలాక్ ను వ్యతిరేకించే వారు, అవినీతిపరులు, ఓట్ జిహాద్ అనే వారు ఓడిపోతారు.

హైదరాబాద్ సొల్యూషన్ సిటీ. ఇక్కడ ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ, దేశం అవినీతి లాంటి సమస్యను అధిగమిస్తుందా? లక్షల కోట్ల స్కామ్ చేసిన పార్టీలను దాటుకుని ముందుకువెళ్తామా? యువతను పట్టించుకోని పార్టీలు దేశ భవిష్యత్ ను మారుస్తాయా? ప్రతి ప్రాజెక్టులో కరెప్షన్ చేసే పార్టీలు.. మోడల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేస్తాయా? ఇవన్నీ మోడీ చేయలేడు.. కానీ ఒక్క మీ ఓటు చేయగలదు. దేశం ఇవాళ ఒక డిజిటల్ పవర్, స్టార్టప్ పవర్, స్పేస్ పవర్. ఇవి మోడీ ట్రాక్ రికార్డ్. కానీ కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ ఏంటి?

దోచుకోవడమే కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్. ఉగ్రవాదులను కాపాడుకోవడమే కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్. మొదటిసారి ఓట్లు వేసే వారు ఒక్కసారి పదేళ్లలో మేమేం చేశామో తెలుసుకోవాలి. ఎందుకంటే కొత్త ఓటర్లు పదేళ్ల క్రితం 10 ఏళ్ల వయసు ఉండి ఉంటారు. వారికి ఏం జరిగిందో కూడా తెలియదు. గతంలో దిల్ సుఖ్ నగర్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగిందనే విషయం తెలుసుకోవాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఎల్లప్పుడూ ఇలాంటి న్యూస్ వినిపించేది. ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ కు వెళ్లి తిందామంటే బ్లాస్ట్ జరుగుతుంది. మూవీకి వెళ్లినా, బస్సులో ప్రయాణించినా బ్లాస్ట్ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇలాంటి న్యూస్ ఏమైనా బయటకు వచ్చిందా? ఈ బాంబు బ్లాస్టులను మీ ఒక్క ఓటు ఆపింది.

మోడీ సేవ దేశానికి అవసరమని కేంద్రంలో బీజేపీకి అవకాశం ఇచ్చారు. ఇది కాంగ్రెస్ కూటమికి నచ్చడం లేదు. అందుకే మోడీని రాకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేయడమంటే.. మళ్లీ పాత రోజులు వచ్చినట్లే.. అందుకే దేశంలో ఉగ్రవాదులను ఎంటర్ కానివ్వొద్దు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మిడిల్ క్లాస్ ప్రజలను అవమానించేలా మాట్లాడే వారు. ఈసారి మ్యానిఫెస్టోలో మిడిల్ క్లాస్ ప్రజలకు కావాల్సిన ఎలాంటి అంశం లేదు. కానీ మిడిల్ క్లాస్ ప్రజల ఓటు బ్యాంకు కోసం ప్రయత్నాలు చేస్తోంది. మీ ఆస్తిపై వారసులకు అధికారం లేకుండా చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. మీ ఆస్తిని కూడా వారసులకు కాకుండా చేసే కాంగ్రెస్ అవసరమా?

కాంగ్రెస్ నరనరాల్లో రేసిజం అనే విషం నిండి ఉంది. అందుకే కాంగ్రెస్, ఇండియా కూటమితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ యువరాజుకు ఒక ఫిలాసఫర్ ట్యూషన్ చెప్పి కొన్ని ఐడియాలు ఇస్తున్నారు. అయోధ్య రామమందిరం నిర్మాణం జరగొద్దని చెప్పారు. పూజలు కూడా నిర్వహించొద్దని యువరాజుకు చెప్పారు. దేశాన్ని విదేశీ కండ్లద్దాల్లో చూసే కాంగ్రెస్ కు ఐడియా ఆఫ్ ఇండియా అనేదానిపై కనీసం అంచనా కూడా వేయలేదు. వెయ్యేండ్ల సంస్కృతి, సత్యమేవ జయతే, అహింస పరమోధర్మ:, బుద్ధం శరణం గచ్చామీ, గాడ్ ఈజ్ గ్రేట్.. ఇవన్నీ.. ఐడియా ఆఫ్ ఇండియా.
నాకు జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే ఎక్కువ. ఇది ఐడియా ఆఫ్ ఇండియా. అధికారం కోసం కాంగ్రెస్, ఆ పార్టీ ఆలోచన విధానమున్న ఏ పార్టీ అయినా ఏమైనా చేస్తాయి.

హైదరాబాద్ లో ఎంఐఎం గెలుపు కోసం గట్టి అభ్యర్థులను కూడా నిలబెట్టలేదు. కేవలం ఓటు బ్యాంకు ఎక్కడ కోల్పోతామోననే భయంతో ఇతర పార్టీలు అలా చేస్తున్నాయి. కాంగ్రెస్.. తన ఓటు బ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను ముస్లింలకు ఇస్తోంది. కాంగ్రెస్ నేతలు ముస్లింలకు మొత్తం రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తున్నారు. ఒక ఆర్ తెలంగాణలో.. మరొక ఆర్ ఢిల్లీలో ఉన్నారు. ఇద్దరూ కలిసి హైదరాబాద్, తెలంగాణను ఏటీఎంలా మార్చుకున్నారు. ఇక్కడ మరొక ఆర్ కూడా ఉంది. అదే రజాకార్ ట్యాక్స్.. వీరు ఎలా వసూలు చేస్తారనేది పాతబస్తీలో తెలుస్తుంది. పాతబస్తీలో కనీస సౌకర్యాలు కూడా లేవు. గతంలో చిన్న వర్షానికే నీట మునుగుతోంది. వీటిని పరిష్కరించమంటే మాత్రం పరిష్కరించడం లేదు. పవర్ కట్ కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే అది కాంగ్రెస్ కు వేసినట్లే. కాంగ్రెస్ కు వేసే ఓటుతో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాదు.
అందుకే కమలం పువ్వు గుర్తుకే ఓటేయండి” అని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.

Also Read : బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్

 

ట్రెండింగ్ వార్తలు