Hyderabad FSL
Hyderabad FSL: హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం చుట్టూ పొలిటికల్ రచ్చ నడుస్తోంది. ఓటుకు నోటు కేసులోని కీలక ఆధారాలను మాయం చేసేందుకే అగ్నిప్రమాదం క్రియేట్ చేసి కట్టు కథ అల్లారని ఆరోపిస్తోంది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. ఫోరెన్సిక్ ల్యాబ్లో ఫైర్ యాక్సిడెంట్ వెనుక సీఎం రేవంత్తో పాటు మరికొందరు పెద్దల హస్తం కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు కేటీఆర్.
ఆ పెద్దలకు ఏకంగా ఢిల్లీ పెద్దల సహకారం ఉండొచ్చంటూ అగ్గిరాజేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరో అడుగు ముందుకేసి ఈ అగ్నిప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని ఇంతటితో వదలకుండా ఇన్ డిటేయిల్డ్ ఇన్వెస్టిగేషన్ జరిపేలా ప్రభుత్వంపై అన్ని దిక్కుల నుంచి ఒత్తిడి తెస్తామంటోంది కారు పార్టీ. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్లోని ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను ధ్వంసం చేసేందుకు అగ్నిప్రమాదం క్రియేట్ చేశారని..దీని వెనుక కేటీఆర్ హస్తం ఉందేమోనంటూ కాంగ్రెస్ రివర్స్ అటాక్ చేస్తోంది.
ఇక బీజేపీ కూడా అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ను కలిపి విమర్శలు గుప్పిస్తోంది. వీరిద్దరూ ఒకరిని ఒకరు సేవ్ చేసుకునే ప్రయత్నంలో గేమ్ ఆడుతున్నారని..పూర్తిస్థాయి దర్యాప్తు జరగాల్సిందేనంటూ డిమాండ్ చేస్తోంది బీజేపీ. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్లో ప్రమాదం వెనుక కుట్ర ఉందంటూ..మొదటి నుంచి డౌట్ వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్..ఓటుకు నోటు కేసులో కీలక ఆధారాలు మాయం చేసి ఈజీగా బయటపడే ప్లాన్లో భాగంగానే ఇలా చేశారని అనుమానిస్తోంది.
Also Read: YS Jagan: జగన్ చెన్నై టూర్లో ఇంట్రెస్టింగ్ సీన్స్.. ఫ్యూచర్లో ఏం జరగనుంది?
ఫోరెన్సిక్ ల్యాబ్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేయగా, క్లూస్ టీమ్ ఆరా తీస్తోంది. ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులుఏ, ల్యాప్టాప్లు, పెన్డ్రైవ్లు దగ్ధం అయినట్టు గుర్తించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఏదైనా కుట్రకోణం ఉన్నదా అనే దిశగా పోలీసులు ఆరా తీస్తున్నారట. వివిధ కేసుల దర్యాప్తులో కీలకపాత్ర పోషించే ఈ ల్యాబ్లో దాదాపు అన్ని కీలక ఫైల్స్ తగలబడిపోయినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
5 గదుల్లో సామగ్రి పూర్తిగా కాలిపోయిందా?
ఎఫ్ఎస్ఎల్లోని మొదటి అంతస్తులో కీలకమైన ఐదు గదుల్లో సామగ్రి పూర్తిగా కాలిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, నయీం కేసు, భూ కుంభకోణాలు, ఇతర రాజకీయ అవినీతి కేసుల విచారణ కీలక దశలో ఉన్నప్పుడే ప్రమాదం జరగడం ఏంటంటూ డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు విపక్ష నేతలు. కీలకమైన ఫైళ్లు, డిజిటల్ డేటాకు నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నా..ఏయే ఫైల్స్ కాలిపోయాయో క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్రమాదంపై తీవ్ర గందరగోళం తలెత్తింది.
అయితే ఓటుకు నోటు కేసుతో సహా కీలక కేసుల ఫైల్స్ విషయంలో అధికారులు పూర్తిస్థాయి క్లారిటీ ఇవ్వట్లేదు. పలు రేప్ కేసులు, చోరీ కేసులకు సంబంధించిన కీలక ఫైల్స్, ఆ ఇన్ఫర్మేషన్ ఉన్న సిస్టమ్స్ బూడిదవడంతో..క్లిష్టమైన కేసుల్లో తదుపరి దర్యాప్తు సంగతేంటన్న చర్చ మొదలైంది. ప్రమాదమే జరిగిందో..లేక కుట్ర కోణమో ఉందో తెలియదు కానీ..మొండి కేసుల్లో కీలక ఆధారాలున్న చోట మంటలు వ్యాపించడం..అధికారులు మాత్రం ఏ ఫైల్స్ మిస్ కాలేదని చెప్తుండటం అంతా అనుమానాలకు తావిస్తోంది.
అందుకే ఏ నష్టం జరగలేదని చెప్తున్నారా?
ఇప్పుడు ఈ ఆరోపణలు, విమర్శల నుంచి గట్టేక్కెందుకే ఏ నష్టం జరగలేదని చెప్తున్నారా? లేక క్లిష్లమైన కేసుల సంబంధించిన సమాచారం ఏదైనా మిస్ అయ్యిందా అనేది పలు కేసులు విచారణకు వచ్చినప్పుడు మాత్రమే క్లారిటీ రానుంది. అయితే అధికారులు మాత్రం ఎలాంటి ఎవిడెన్స్ మిస్ కాలేదని.. ఒకవేళ ఏవైనా డాక్యుమెంట్లు కాలిపోయినా, వాటి డేటాను తిరిగి పొందే సాంకేతిక సామర్థ్యం ఉందని చెప్పుకొస్తున్నారు.
ల్యాబ్లో కాలిపోయినవి ఇప్పటికే కోర్టులకు సమర్పించిన డాక్యుమెంట్ల కాపీలేనని, ఒరిజినల్స్ కోర్టు దగ్గర ఉంటాయని అంటున్నారు. ఏదిఏమైనా ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్నిప్రమాదం చుట్టూ రాజకీయ దుమారం అయితే నడుస్తోంది. ప్రజలను అనుమానాలు అయితే వెంటాడుతున్నాయి. వీటన్నింటికి క్లారిటీ ఎప్పుడిస్తుందో వేచి చూడాలి.