×
Ad

రేవంత్‌, పీకే మధ్య ఎక్కడ చెడింది? ప్రశాంత్ కిశోర్ అంత పెద్ద శపథం ఎందుకు చేస్తున్నట్లు?

బీఆర్ఎస్‌ కూడా ఇప్పుడు అపోజిషన్‌లో ఉండటంతో పీకేతో సూచనల ప్రకారం నడుచుకోవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ప్రశాంత్‌ కిశోర్.. షార్ట్ కట్‌లో పీకే. ఈ పేరు నేషనల్ పాలిటిక్స్‌తో పాటు తెలుగు స్టేట్స్‌లోనూ చాలా పాపులర్. పబ్లిక్ పల్స్‌కు దగ్గట్లుగా..రాజకీయ పార్టీల అధినేతకు డైరెక్షన్స్‌ ఇస్తూ..ఎన్నికల గెలిచే వ్యూహాలను అమలు చేసే స్ట్రాటజిస్టే ప్రశాంత్‌ కిశోర్. గతంలో ఏపీలో వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డికి..తమిళనాడులో స్టాలిన్‌కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా సలహాలు, సూచనలు అందించి..అధికారంలోకి వచ్చేందుకు సజీషన్స్ ఇచ్చారు. రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్‌ కిశోర్‌ బిహార్ వాసి.

ఇప్పుడాయన జన్ సురాజ్ పార్టీ అధినేత కూడా. త్వరలో జరగబోయే బిహార్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. సరిగ్గా ఇదే టైమ్‌లో సీఎం రేవంత్‌ టార్గెట్‌గా వరుసగా స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు ప్రశాంత్‌కిశోర్‌. ఏకంగా తెలంగాణకు వచ్చి రేవంత్‌ను ఓడించి తీరుతానని కంకణం కట్టుకున్నారు. బీజేపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడని రేవంత్ మీద ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు పీకే.

ఆయన ఇంకోసారి గెలవడని కరాఖండిగా చెబుతున్నారు. బిహార్ ప్రజల డీఎన్ఏ, తెలంగాణ ప్రజల డీఎన్ఏ కంటే తక్కువ అయినప్పుడు, ఢిల్లీకి వచ్చి మూడుసార్లు తన సహాయం ఎందుకు అడిగాడని రేవంత్‌ను ఉద్దేశించి పీకే ప్రశ్న వేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు రేవంత్‌ తన సహాయం కోరినట్లు చెప్పుకొస్తున్నారు పీకే.

Also Read: మూడు ప్రాంతాలు.. మూడు సభలు.. కూటమి బిగ్ ప్లాన్..!

అయితే రేవంత్‌, పీకే కలిసి పనిచేయలేదు. సునీల్‌ కనుగోలు టీమ్‌ రేవంత్‌కు ఎన్నికల్లో స్ట్రాటజిస్ట్‌గా పనిచేసింది. కానీ రేవంత్‌తో పీకేకు ఎక్కడా తేడా కొట్టిందో తెలియదు కానీ..ఓడించి తీరుతానని ఛాలెంజ్‌ చేయడం మాత్రం పొలిటికల్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు బిహార్ ఐఏఎస్, ఐపీఎస్‌లను ఉద్దేశించి కూడా రేవంత్‌ చేసిన కామెంట్స్‌ దుమారం లేపాయి.

అంతేకాదు కేసీఆర్‌ది బిహీర్‌ డీఎన్ఏ..తనది తెలంగాణ డీఎన్‌ఏ అన్న రేవంత్‌..తెలంగాణ DNA, బిహార్ DNA కంటే మెరుగైందని కూడా అప్పట్లో స్టేట్‌మెంట్‌ ఇచ్చి రచ్చకు దారితీశారు. ఆ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ..బిహార్ ప్రజలను హేళన చేస్తూ మాట్లాడిన రేవంత్ తమ గడ్డపై ఎలా అడుగుపెడతాడో చూస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు పీకే. ప్రస్తుతం బిహార్‌లో ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం రేవంత్‌ ప్రచారం చేయనున్నారు. పైగా తెలంగాణ మోడల్ అంటూ కులగణన, ఫ్రీబస్, ఫ్రీ కరెంట్, వంటి అంశాలను బిహార్‌లో అస్త్రాలుగా వాడేందుకు సిద్ధమవుతున్నారు.

అందుకే రేవంత్‌ టార్గెట్‌గా పీకే బాణాలు

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలలో రేవంత్‌కు ఈ మధ్య కాస్త నేషనల్ ఎక్స్‌పోజర్ కూడా వచ్చింది. యంగ్‌ లీడర్ కావడంతో ఆయన క్యాంపెయిన్ చేస్తే కాంగ్రెస్‌కు కొంతలో కొంతైన అడ్వాంటేజ్‌గా మారే ఛాన్స్ ఉందని హస్తం పార్టీ లెక్కలు వేసుకుంటుందట. అందుకే రేవంత్‌ టార్గెట్‌గా పీకే బాణాలు వదులుతున్నారట. అక్కడ కాంగ్రెస్‌ను సైడ్‌ చేసి..తాను సత్తా చాటాలనేది పీకే ప్లాన్ అంటున్నారు. రేవంత్‌ తమ రాష్ట్రం ప్రజలను అవమానించారని చెప్తూ లోకల్ సెంటిమెంట్‌ను రాజేసి..అక్కడ మైలేజ్‌ పొందడంతో పాటు తెలంగాణలో రేవంత్‌ను ఓడిస్తానని చెప్పి ఇక్కడ ఇమేజ్‌ సంపాదించే స్కెచ్ వేస్తున్నారట పీకే. అందుకే రేవంత్ ఎంత..ఆయన హాలత్‌ ఎంత అన్నట్లుగా మాట్లాడుతున్నారట ప్రశాంత్‌కిశోర్.

ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పీకే ఓ ఇంగ్లీష్ ఛానల్‌తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సోషల్ మీడియా హైలెట్ చేస్తుంటే..కాంగ్రెస్ నాయకులు PK చేసేదేం లేదు..ఆయనతో అయ్యేదేమి కూడా లేదని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. త్వరలో జూబ్లీహిల్స్ బైఎలక్షన్‌ జరగనున్న నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. పైగా పీకే కామెంట్స్‌ను బీఆర్ఎస్ అడ్వాంటేజ్‌గా మల్చుకుంటోంది.

గత ఎన్నికలకు ముందు పీకే బీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా పనిచేస్తారని ప్రచారం జరిగింది. ఆల్‌మోస్ట్‌ పీకే వ్యూహాలతో ఎన్నికలకు వెళ్తారని..ఆయన 30 నుంచి 40 మంది అభ్యర్థులను మార్చాలని కేసీఆర్‌కు సూచించారని..అందుకు గులాబీ బాస్‌ ఒప్పుకోకపోవడంతో కలిసి పనిచేయలేకపోయారని అంటున్నారు. ఇప్పుడు రేవంత్‌ను ఓడిస్తానని పీకే సవాల్‌ చేస్తుండటంతో..అది బీఆర్ఎస్‌ అస్త్రంగా మార్చుకుంటుంది. పైగా పీకే తన భావజాలం దృష్ట్యా బీజేపీతో కలిసి పనిచేయలేరు.

రేవంత్‌ను ఓడిస్తానంటున్నారంటే కాంగ్రెస్‌తో కూడా జతకట్టారు. అలాంటప్పుడు తెలంగాణలో స్ట్రాంగ్‌ రీజనల్ ఫోర్స్‌గా ఉన్న బీఆర్ఎస్సే పీకేకు ఉన్న బెటర్ ఆప్షన్ అన్న టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్‌ కూడా ఇప్పుడు అపోజిషన్‌లో ఉండటంతో పీకేతో సూచనల ప్రకారం నడుచుకోవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే పీకే ఒంటరిగా పనిచేస్తారో..లేక బీఆర్ఎస్‌ జతకడుతారో తెలియదు కానీ..రేవంత్‌ను ఓడించి తీరుతానని ఆయన ఛాలెంజ్‌ చేయడంతో పాటు తెలంగాణలోనే కాదు..నేషనల్ పాలిటిక్స్‌లోనూ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

అయితే పీకేనే కాదు బిహార్‌కు చెందిన కాంగ్రెస్ యువనేత కన్నయ్య కుమార్ కూడా రేవంత్‌రెడ్డి తీరుపై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి మూర్ఖుడు..తెలివితక్కువ వాడు..బిహార్ ప్రజలను కూలీలు అని ఎలా అంటాడు అంటూ మండిపడ్డారు కన్నయ్య కుమార్. రేవంత్ తమ పార్టీ సీఎం అయినా మూర్ఖుడే అని అంటా..తాను భయపడనంటూ కన్నయ్య కుమార్ స్టేట్‌మెంట్‌ ఇవ్వడం మరింత సెన్సేషన్ అవుతోంది. బిహార్‌కు చెందిన ఇద్దరు కీలక నేతలు..పైగా కాంగ్రెస్‌ పార్టీలో పాపులర్ లీడర్ అయిన కన్నయ్యకుమార్‌ కూడా రేవంత్‌ తీరును తప్పుబట్టడం చర్చనీయాంశంగా మారుతోంది. మరి ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక రేవంత్‌ బిహార్‌లో ప్రచారానికి వెళ్తే ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయో..డైలాగ్ వార్ ఎలా ఉండబోతోందో చూడాలి మరి.