Telangana Rain : తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఐదు రోజులు వానలు.. హెచ్చరికలు జారీ.. తగ్గుముఖం పట్టనున్న ఎండలు
Telangana Rain : తెలంగాణ వ్యాప్తంగా వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. వర్షాలతోపాటు వడగండ్లు, 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.
- Harish Thanniru
- Updated on- May 7, 2026 / 10:31 AM IST
Telangana Rain
- తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్
- రాష్ట్రంలో ఐదు రోజులు వర్షాలు
- తగ్గుముఖం పట్టనున్న ఎండల తీవ్రత
Telangana Rain : రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నిన్నమొన్నటి వరకు 45 నుండి 46 డిగ్రీలదాకా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, బుధవారం ఎండ తీవ్రత కాస్త తగ్గింది. 43డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే వారం రోజులు ఎండల తీవ్రత తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదే సమయంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : karimnagar Jewellery robbery case : కరీంనగర్ జ్యువెల్లరీ షాపులో చోరీ వారిపనే.. నిర్ధారణకు వచ్చిన పోలీసులు..
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. వర్షాలతోపాటు వడగండ్లు, 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోనూ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు వర్షం పడే సమయంలో, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ ల వద్ద ఉండొద్దని, సురక్షిత ప్రాంతంలోకి వెళ్లాలని అధికారులు సూచించారు. అదేవిధంగా వర్షం పడే సమయంలో ఎత్తయిన ప్రదేశాల్లో ఉండకూడదని, పాత షెడ్లలో, గోడల పక్కన నిలబడరాదని సూచిస్తున్నారు.
వర్షాల కారణంగా వచ్చే వారం రోజులుపాటు ఎండల తీవ్రత తగ్గుముఖం పడుతుందని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అయితే, పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు తమ పంట ఉత్పత్తులకు ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
