Revanth Reddy – CM KCR : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ డిక్లరేషన్ పై రేవంత్ ట్వీట్ చేశారు. తమ డిక్లరేషన్ దళిత, గిరిజన జీవితాల్లో గుణాత్మక మార్పుకు కన్ఫర్మేషన్ అని రేవంత్ రెడ్డి చెప్పారు. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేయడం లాంటిది కాదని స్పష్టం చేశారు. తమ డిక్లరేషన్ ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేయడం లాంటిది కాదన్నారు.
గిరిజన రిజర్వేషన్లు 12 శాతం చొప్పున పెంచుతానని మోసం చేయడం లాంటిది కాదని చెప్పారు. మద్ధతు ధర అడిగిన గిరిజన రైతులను బందిపోట్ల కంటే ఘోరంగా బేడీలు వేసి అవమానించడం లాంటిది కాదని పేర్కొన్నారు. నేరెళ్ళ ఇసుక దోపిడీని ప్రశ్నించిన దళిత, బీసీ బిడ్డలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లాంటిది కాదని తెలిపారు.
Harish Rao : బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి : మంత్రి హరీష్ రావు
దళిత, గిరిజనులకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కుని రియల్ ఎస్టేట్ మాఫియాకు అమ్ముకోవడం లాంటిది కాదన్నారు. తమ డిక్లరేషన్ దళిత మహిళ మరియమ్మను లాకప్ డెత్ చేయించడం లాంటిది కాదని స్పష్టం చేశారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మంత్రి పదవులు తీసుకుని ఒక్క మాదిగకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం లాంటిది కాదని వెల్లడించారు.
ఏబీసీడీ వర్గీకరణ చేయకుండా మోసం చేయడం లాంటిది కాదని తెలిపారు. తమ డిక్లరేషన్ దళితబంధు పథకంలో 30 శాతం కమీషన్లకు కక్కుర్తిపడే రాబందుల లాంటిది కాదు. అందుకే యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటేనని.. “కేసీఆర్ ఖేల్ ఖతం – బీఆర్ఎస్ దుఖాన్ బంద్” అని అన్నారు.