సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం.. దట్టంగా వ్యాపించిన పొగలు

మంటలు అంటుకోవడంతో హోటల్‌లోని కస్టమర్లు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో హోటల్‌ నుంచి బయటకు పరుగులు తీశారు.

secunderabad paradise hotel fire accident

secunderabad paradise hotel: సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో శుక్రవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. సెల్లార్‌లో మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో హోటల్‌లోని కస్టమర్లు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో హోటల్‌ నుంచి బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. సెల్లార్‌లోని జనరేటర్ గదిలో మంటలు అంటుకున్నట్టు ఫైర్ సిబ్బంది గుర్తించారు.

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో జనరేటర్ హీట్ అవ్వడంతో అగ్నిప్రమాదం జరిగిందని ఫైర్ సేఫ్టీ అధికారి షబీర్ అలీ తెలిపారు. జనరేటర్ గదిలో స్క్రాప్, పేపర్లు ఉండడంతో మంటలు వ్యాపించాయని.. ఒక్కసారిగా ప్రజలు, కస్టమర్లు భయాందోళనకు గురయ్యారని చెప్పారు. స్వల్ప అగ్ని ప్రమాదమే అయినా దట్టంగా పొగలు వ్యాపించాయని, మంటలు అదుపులోకి వచ్చాయన్నారు. పారడైజ్ హోటల్ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. జనరేటర్ హీట్ అవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్టు చెప్పారు.

Also Read : చూసేందుకు రెండు కళ్లు సరిపోవు.. వారి ఒంటిపై 25 కిలోల బంగారం, విలువ రూ.15 కోట్లు!

ట్రెండింగ్ వార్తలు