electricity charges
Telangana Electricity : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అన్ని వర్గాల ప్రజల ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపడుతోంది. అయితే, వేసవి కాలంలో విద్యుత్ వాడకం పెరగడం సర్వసాధారణమే.. అదే సమయంలో విద్యుత్ ఛార్జీలు (electricity charges) కూడా భారీగా పెరుగుతాయని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.
ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఎస్పీడీసఎల్ పరిధిలో మొత్తం కోటి 20లక్షల95వేల963 మంది వినియోగదారులు ఉన్నారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 12లక్షల09వేల563 మంది వినియోగదారులు పెరిగారని పాటిల్ చెప్పారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు 39.556 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించినట్లుగా తెలిపారు. వాటిలో గృహ విద్యుత్ వినియోగం 23శాతం ఉండగా.. పారిశ్రామిక రంగం 31శాతం, వ్యవసాయ రంగం 21శాతం, కమర్షియల్ 16శాతం, ఇతర కేటగిరీల్లో 9శాతంగా నమోదైందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 3న 18,139 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదు కాగా.. అదులో కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 4,421 మెగావాట్ల రికార్డు నమోదైనట్లుగా తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం వల్ల విద్యుత్ చౌర్యం తగ్గిందని జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఎస్పీడీసీఎల్ సంస్థ పరిధిలో 5.44కోట్ల జీరో బిల్లులు జారీ చేయగా.. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నేుంచి 1,930.66కోట్ల సబ్సిడీ డబ్బులు వచ్చాయని చెప్పారు. అదేవిధంగా విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు రైతుల కుటుంబాలకు రూ.5వేల చొప్పున అందజేశారు.