×
Ad

Komatireddy Venkat Reddy : ట్రాఫిక్‌లో చిక్కుకుపోయా అందుకే, కిషన్ రెడ్డి నీచ రాజకీయాలు మానుకో- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయ్యేటప్పుడు 66మంది బీజేపీ ఎంపీలు కూడా లేరు. Komatireddy Venkat Reddy

  • Published On : September 24, 2023 / 09:44 PM IST

Komatireddy Venkat Reddy (Photo : Twitter)

Komatireddy Venkat Reddy – Kishan Reddy : మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి వెళ్లింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకి పార్లమెంటు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. దీన్ని క్యాష్ చేసుకోవాలని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల చిచ్చు రాజుకుంది.

మహిళా రిజర్వేషన్ బిల్లు ఘనత మాదంటే.. కాదు కాదు మాదే అని వాదించుకుంటున్నాయి. తాజాగా కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిప్పులు చెరిగారు. తనను ఉద్దేశించి కిషన్ రెడ్డి చేసిన విమర్శలకు కోమటిరెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. చిల్లర రాజకీయాలు మానుకో అంటూ కిషన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Also Read..Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లోకి కొనసాగుతున్న వలసలు.. హస్తం గూటికి వేముల వీరేశం, మైనంపల్లి!

”మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. స్వయంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్నామని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు మా బిల్లు అంటూ సోనియా గాంధీ ప్రకటన కూడా చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయ్యేటప్పుడు 66మంది బీజేపీ ఎంపీలు కూడా లేరు. 66 మంది బీజేపీ ఎంపీలు ఎందుకు లేరో కిషన్ రెడ్డి సమాధానం చెప్పు.

అనవసరంగా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని చెప్పిందే కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో లబ్ది కోసమే మహిళా రిజర్వేషన్ అంటూ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను బీజేపీ ఏర్పాటు చేసింది. తెలంగాణ కోసం రాజీనామా చేయని వ్యక్తి కిషన్ రెడ్డి. అలాంటా వ్యక్తికి మాపై విమర్శలు చేసే నైతిక అర్హత లేదు. పార్లమెంటు సమావేశాలకు వస్తున్నప్పుడు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం వల్ల మేము ఆ సమయంలో పార్లమెంటులో లేము” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

Also Read..Chandrababu Interrogation : సీఐడీ అధికారులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? చంద్రబాబుని అడిగిన ఏసీబీ కోర్టు జడ్జి

మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ లో కాంగ్రెస్ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొనలేదంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శలకు దిగారు. దీనిపై కోమటిరెడ్డి తీవ్రంగా స్పందించారు. మేము ఢిల్లీలో ట్రాఫిక్ లో చిక్కుకుపోవడం వల్లే ఆలస్యమై పార్లమెంటులో జరిగిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ లో పాల్గొనలేకపోయామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చారు. విషయం తెలుసుకోకుండా తమను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.