Telangana Inter Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలపై వివాదం.. బోర్డు వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు
తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు వివాదాస్పదంగా మారాయి. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం భారీగా తగ్గడంతో.. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- kunduru Vinod
- Published On : December 17, 2021 / 12:59 PM IST
Telangana Inter Results
Telangana Inter Results : తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు వివాదాస్పదంగా మారాయి. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం భారీగా తగ్గడంతో.. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం విడుదల చేసిన ఫలితాల్లో 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మరి ఇంత తక్కువ శాతం ఉత్తీర్ణత నమోదు కావడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. చక్కగా చదివే విద్యార్థులు కూడా పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని వారు వాపోతున్నారు. కరోనా టైమ్లో విద్యార్ధులు ఎన్నో ఇబ్బందులు పడి పరీక్షలు రాస్తే.. మరీ ఇంత తక్కువ మందిని పాస్ చేస్తారా అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభ్యంతరం తెలుపుతున్నారు.
చదవండి : Inter Student : ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థిని ఆత్మహత్య
ఇక ఫలితాలపై విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నెల రోజులే టైమ్ ఇచ్చి పరీక్షలు పెట్టారని ఎస్ఎఫ్ఐ మండిపడుతోంది. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్లనే ఇంతమంది ఫెయిల్ అయ్యారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కాగా గత మార్చిలో కరోనా ఉధృతి కారణంగా ప్రభుత్వం పరీక్షలు లేకుండానే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ను సెకండియర్లోకి ఇంటర్ బోర్డు ప్రమోట్ చేసింది. కరోనా తగ్గడంతో అక్టోబర్లో పరీక్షలు నిర్వహించింది. పరీక్షల సమయంలో కూడా విద్యార్థుల తల్లిదండ్రులు బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి : Intermediate Exams Results : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలు విడుదల
హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. పలు విద్యార్థి సంఘాలు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వద్ద ధర్నాకు దిగంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితిలు ఏర్పడ్డాయి.
