కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల కవిత చేరేందుకు రంగం సిద్ధం.. అందుకే ఇలా..: తీన్మార్ మల్లన్న

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి మరీ కవితకు అండగా నిలిచారని, ఇంతకన్నా దరిద్రం ఇంకేం ఉంటుందని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ పెద్దలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పలు ఆరోపణలు గుప్పించారు. ఇటీవల ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగినప్పుడే కవితకు సైతం మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఇవ్వాలనుకున్నారని, ఇది నిజమో కాదో కాంగ్రెస్ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందని అన్నారు.

బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తనపై కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారని మల్లన్న అన్నారు. ప్రభుత్వ పెద్దలు తనకు అండగా నిలవాల్సింది పోయి కవితకు మద్దతు తెలుపు తననే విమర్శించడం సిగ్గుచేటని చెప్పారు.

Also Read: అప్పట్లో మహారాణిలా వెలిగిపోయిన హీరోయిన్.. పెళ్లయ్యాక వేధింపులు.. ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌.. రూ.87,00,00,000 సంపాదించింది..

తనపై తెలంగాణ జాగృతి జరిపిన దాడిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా స్వాగతించలేదని అన్నారు. కానీ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి మరీ కవితకు అండగా నిలిచారని, ఇంతకన్నా దరిద్రం ఇంకేం ఉంటుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి, కల్వకుంట్ల కవితకు అనధికార ఒప్పందం నడుస్తోందని చెప్పారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ఆర్డినెన్స్ రాకముందే కవిత సంబరాలు చేయడం, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆమెకు అండగా నిలవడం చూస్తుంటే కాంగ్రెస్‌తో ఆమె కలిశారని స్పష్టమవుతోందని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి పనిచేస్తున్నారని, తనపై దాడి జరిగితే తనపైనే కేసులు నమోదు చేయడం ఏంటని నిలదీశారు. సీఐ గోవింద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని , శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి, డీసీపీకి సైతం ఫిర్యాదు చేశానని అన్నారు.