మోడీ 2.0 ప్రభుత్వం తొలి ఏడాది పాలన విజయాలను జనంలోకి వెళ్లాలని నిర్ణయించింది బీజేపీ జాతీయ నాయకత్వం. ఇందుకోసం జన సంవాద్ వర్చువల్ ర్యాలీలను మార్గంగా ఎంచుకుంది. దేశవ్యాప్తంగా జరుగుతోన్న వర్చువల్ ర్యాలీలలో మోదీ పాలనపై బీజేపీ నేతలు మాట్లాడుతుంటే… తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ఈ వర్చువల్ ర్యాలీలను ఇక్కడి నాయకత్వం నిర్వహిస్తోంది. ఈ వ్యవహారంపై పార్టీలోనే కొంతమంది ముఖ్య నేతలు పెదవి విరిస్తున్నారు.
గతంలో బీజేపీ నాయకత్వం విధానపరమైన అంశాలపై విమర్శలు చేసేది. ప్రస్తుతం బీజేపీ నాయకుల శైలి మారినట్లు కనపడుతోంది. విధానపరమైన అంశాల కంటే ఎక్కువగా వ్యక్తిగత అంశాలపై దృష్టి పెట్టడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ దూషణలకు దిగుతుండడంతో బీజేపీలోనే కొందరు నాయకులకు నచ్చడం లేదట. బీజేపీ ర్యాలీలు కొంత వరకూ యువ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపుతున్నప్పటికీ సీనియర్ నేతలు మాత్రం ఉపయోగం లేదని చెబుతున్నారట.
కేంద్రంలో పార్టీ సాధించిన విజయాలను చెప్పుకుంటే బావుంటుందని, రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధుల గురించి వివరిస్తే పార్టీకి ప్రయోజనం తప్ప.. కేసీఆర్ను విమర్శించడం వల్ల లాభం లేదని అంటున్నారట. ఒకవేళ విమర్శలు చేసినా రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై చేయాలి. కానీ, వ్యక్తిగత దూషణలకు దిగడం సరి కాదని సన్నిహితుల వద్ద సీనియర్లు చెబుతున్నారట.
వ్యక్తిగత దూషణలు వల్ల తాత్కాలికంగా లబ్ధి చేకూరినట్టు కనిపించినా లాంగ్ రన్లో వర్కవుట్ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా అదే వేదిక మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పీచ్ను, అధ్యక్షుడి స్పీచ్ను పోల్చి చూపిస్తున్నారట. మరి కొత్త నాయకత్వం ఆధ్వర్యంలో ఈ కొత్త ఒరవడి బీజేపీకి వర్కౌట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.