BRS Kalyana Lakshmi: కల్యాణలక్ష్మి రద్దుకు కాంగ్రెస్ కుట్ర.. కేటీఆర్ సంచలన ఆరోపణలు.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారాస నిరసనలు
Kalyana Lakshmi: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను శాశ్వతంగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేటీఆర్ (BRS Protest)సంచలన ఆరోపణలు చేశారు.
Ktr alleges congress conspiracy to scrap kalyana lakshmi scheme
- కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు కుట్ర
- నేడు భారాస భారీ నిరసనలు
- ఆడబిడ్డల ఆత్మగౌరవంపై దాడి
BRS Kalyana Lakshmi: తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక అండగా నిలుస్తూ వచ్చిన ప్రతిష్టాత్మక ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలను శాశ్వతంగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో కుట్ర చేస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (Kalyana Lakshmi)సంచలన ఆరోపణలు చేశారు. హైకోర్టు విచారణను సాకుగా చూపిస్తూ, ప్రభుత్వం వైపు నుంచి నాలుగుసార్లు గడువు ఇచ్చినా సరైన కౌంటర్ దాఖలు చేయకపోవడం వెనుక పెద్ద ప్లాన్ ఉందన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల భారం తగ్గించడమే కాకుండా, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కేసీఆర్ హయాంలో 2014 అక్టోబరు 2న రూ.51,000 ఆర్థిక సాయంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత దానిని దశలవారీగా రూ.1,00,116కు పెంచి, కరోనా సంక్షోభంలోనూ దాదాపు 13 లక్షల మంది కుటుంబాలకు రూ.13,000 కోట్ల మేర సాయం అందించారని ఆయన గుర్తుచేశారు.
Also Read – Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం.. నేటి నుంచే సర్వీసులు.. వారికి ఫ్రీ ప్రయాణం
హామీల నుంచి తప్పుకునేందుకే ప్రభుత్వ నాటకాలు:
ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మి పథకంతో పాటు ఆడబిడ్డలకు అదనంగా తులం బంగారం ఇస్తామని పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ఆ హామీని నెరవేర్చలేక చేతులెత్తేసిందని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లు, ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు ఏకంగా మూల పథకాన్నే ఎత్తివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు భారాస పిలుపు:
ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో భారాస ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. పేదింటి ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పథకాన్ని కాపాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
