Kcr Tour
Telangana Chief Minister KCR: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరుగుతుండటంతో.. అభివృద్ధి కార్యక్రమాలను నేరుగా పరిశీలించనున్నారాయన. అందులో భాగంగా.. వారంలోనే.. ఐదారు జిల్లాల్లో పనులను పరిశీలించనున్నారు కేసీఆర్. గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలని భావిస్తున్న తెలంగాణ సర్కార్.. పట్టణాలతో పాటు.. గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది.
ప్రణాళికబద్ధంగా గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించి.. ప్రతి ఊరిని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామాలకు నెలకు 308 కోట్లు, నగరాలు, పట్టణాలకు 148 కోట్ల రూపాయలు అభివృద్ధికి కేటాయిస్తున్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ కాలువలను సరిచేయడం, మురికి కాలువలు శుభ్రం చేయడం, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ మరమ్మతులు, దోమల నివారణ చర్యలు చేపట్టడం లక్ష్యంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం సాగుతోంది.
ఇటీవల జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయితీరాజ్ అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్.. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిని, అంశాల వారిగా లక్ష్యాలపై చర్చించారు. ఆనుకున్న రీతిలో పనులు జరక్కపోతే.. ఆకస్మిక తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందులో భాగంగానే.. ఈ వారంలో ఐదారు జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 4వ తేదీన పర్యటించనున్నారు సీఎం. సీఎం కేసీఆర్ స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేయడంతో పాటు.. కలెక్టర్లు కూడా ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు.