Cm Revanth Reddy: కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేస్తాం.. డీమార్ట్, బిగ్ బజార్లను తలదన్నేలా..- సీఎం రేవంత్

మ‌హిళా సంఘాలు రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకోవాలి. మండలాల్లో గోడౌన్లు, లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకోవాలి. 100 ఎక‌రాల వ‌ర‌కు భూముల‌ను ఇవ్వ‌డానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

  • Updated on- May 25, 2026 / 06:02 PM IST

Cm Revanth Reddy: ప్ర‌జాపాల‌న‌, ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక‌లో భాగంగా మ‌హిళా వారోత్స‌వాల‌ను నిర్వ‌హించుకుంటున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మ‌హిళ‌ల‌ను ఆర్థికంగా నిల‌బెట్టే అద్భుత‌మైన కార్య‌క్ర‌మం ఇది అని చెప్పారు. 8వేల మహిళా సంఘాల భ‌వ‌నాలకు ఒకేసారి శంకుస్థాప‌న చేస్తున్నామని, దేశంలోనే ఇదొక అద్భుత కార్యక్రమం అని వెల్లడించారు. తెలంగాణ ఆడ‌బిడ్డ‌ల ఆశీర్వాదంతో ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డిందన్నారు రేవంత్ రెడ్డి. మ‌హిళ‌లు అభివృద్ధి సాధించిన‌ప్పుడు రాష్ట్రం ఆర్థికంగా నిల‌బ‌డుతుందన్నారు. ఈ విషయంలో ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప్ర‌య‌త్నం చేస్తోందన్నారు. ఒకేసారి 8వేల ఇందిరా గాంధీ స్త్రీ శ‌క్తి భ‌వ‌నాల‌కు వ‌ర్చువ‌ల్ గా శంకుస్థాప‌న చేశారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.

2023 డిసెంబ‌ర్ 7న ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత రెండు రోజుల్లోనే ఆర్టీసీలో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం క‌ల్పించామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు ఉచిత ప్రయాణం కోసం 10 వేల కోట్ల రూపాయ‌ల‌ను ఆర్టీసీకి చెల్లించామని తెలిపారు. మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం వ‌ద్ద‌ని కొంద‌రు రెచ్చ‌గొట్టారని.. కానీ, మ‌హిళా అభ్యున్న‌తే రాష్ట్ర అభివృద్ధి అని భావించి ఉచిత బస్సు ప్ర‌యాణం ఇస్తున్నామని వివరించారు.

”మ‌హిళ‌ల‌పై కుట్ర‌ను తిప్పి కొట్టి ఉచిత ప్ర‌యాణం కొన‌సాగించాం. బ‌స్సుల‌కు మ‌హిళ‌ల‌ను య‌జ‌మానుల‌ను చేయాల‌ని 1000 బ‌స్సు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా చేశాం. జూన్ 5న ప‌రేడ్ గ్రౌండ్ లో 553 బ‌స్సుల‌ను ప్రారంభించ‌బోతున్నాం. సోలార్ ఎన‌ర్జీ అంటే అదానీ, అంబానీ గుర్తుకు వ‌స్తారు. 1000 మెగా వాట్ల సోలార్ ఎన‌ర్టీ ప్లాంట్ల‌ను మ‌హిళా సంఘాల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేయిస్తోంది. రిల‌య‌న్స్ వాళ్లు చేసే పెట్రోల్ బంక్ వ్యాపారాన్ని మ‌హిళా స్వ‌యం స‌హాయక సంఘాల‌తో చేయిస్తున్నాం. మారుమూల గ్రామాల్లోని మ‌హిళ‌లు ఆర్థికంగా నిల‌బ‌డాల‌న్న‌దే ప్ర‌య‌త్నం.

5 ల‌క్ష‌ల వ‌ర‌కు బ్యాంక్ లింకేజీ లోన్ లను 10 ల‌క్ష‌ల‌కు పెంచుతున్నాం. ఇప్పటివ‌ర‌కు 60 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ లోన్ లు అందించాం. సున్నా వ‌డ్డీ రుణాల కోసం ప్ర‌భుత్వం ఇప్ప‌టికే 1390 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించింది. మ‌హిళ‌లు తీసుకున్న ప్ర‌తి రూపాయిని చెల్లించి ముందుకు వెళ్తున్నారు. లోన్లు తీసుకున్న వ్యాపారులు అప్పులు ఎగ్గొట్టి పారిపోతున్నారు.

మ‌హిళా సంఘాలు రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకోవాలి. మండలాల్లో గోడౌన్లు, లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకోవాలి. 100 ఎక‌రాల వ‌ర‌కు భూముల‌ను ఇవ్వ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది. రైస్ మిల్లులు, గోడౌన్ల కోసం ప్ర‌భుత్వ భూముల‌ను కేటాయిస్తాం. ఆడ‌బిడ్డ‌లు ప్ర‌తి గింజ‌కు జ‌వాబుదారిగా ఉంటారు. ఇక ముందు మిల్లుల గోడౌన్ల‌లో ధాన్యం స్టాక్స్ పెట్టం. స్వ‌యం స‌హాయ మ‌హిళా సంఘాలు వ‌డ్లు కొనుగోలు చేసి బియ్యం ప్ర‌భుత్వానికి ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటాం. రైస్ మిల్లులు, గోడౌన్ల ఏర్పాటు కోసం సున్నా వ‌డ్డీతో బ్యాంక్ లింకేజీ ఏర్పాటు చేసి కావాల్సిన రుణాల‌ను మంజూరు చేస్తాం.

కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లు..

మ‌హిళా సంఘాల‌తో మ‌హిళా శ‌క్తి సూప‌ర్ బ‌జార్లు కార్పొరేట్ త‌ర‌హాలో ఏర్పాటు చేయాలి. మ‌హిళా శ‌క్తి సూప‌ర్ బ‌జార్ల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా వాటాదారుగా ఉంటుంది. నాణ్య‌మైన వ‌స్తువుల కోసం మ‌హిళా శ‌క్తి సూప‌ర్ బ‌జార్ లో దొరికేలా ఏర్పాటు చేసుకోవాలి. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో సూప‌ర్ బ‌జార్ల కోసం ప్ర‌భుత్వ భూముల‌ను చాలా త‌క్కువ ధ‌రకు లీజుకు ఇస్తాం. దేశంలోనే బెస్ట్ సూప‌ర్ బ‌జార్లుగా త‌యారు కావాలి. డీమార్ట్, బిగ్ బజార్ ల కంటే బెస్ట్ గా మ‌హిళా శ‌క్తి సూప‌ర్ బ‌జార్లు ఉండాలి. మహిళలను కోటీశ్వ‌రుల‌ను చేయాల‌న్న ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంది. ఈ ప్ర‌భుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే శ‌క్తి మ‌హిళ‌ల‌కు ఉంది. 2034 నాటికి కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేస్తాం.

రాష్ట్ర ప్ర‌భుత్వం ఆడ‌బిడ్డ‌కు సారెలా చీర‌లు అంద‌జేసింది. గ‌తంలో ఇచ్చిన చీర‌లు పంట పొలాల్లో పిట్ట‌ల‌ను కొట్ట‌డానికి ఉప‌యోగించారు. ఇందిర‌మ్మ చీర‌ల‌తో పాల‌పిట్ట‌ల్లా ఆడ‌బిడ్డ‌లు క‌నిపిస్తున్నారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కూడా ఇందిర‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేస్తారు. చిలుక ప‌చ్చ రంగులో ఇందిర‌మ్మ చీర‌లు ఇవ్వ‌బోతున్నాం. అన్న‌ద‌మ్ములు కొంద‌రు ఇంట్లో నుంచి చెల్లెళ్లను వెళ్ల‌గొడుతున్నారు. ఈ మ‌ధ్య రాజ‌కీయాల్లో కొంద‌రు చెల్లిని బ‌య‌ట‌కు వెళ్ల‌గొడితే బ‌య‌ట‌కు వెళ్లి ఎలా శాప‌నార్థాలు పెడుతుందో చూస్తున్నాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.