Puvvada Ajay Kumar and Thummala Nageswara Rao
Puvvada Ajay Vs Thummala : తెలంగాణలో ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్ కు చేరింది. పార్టీల నేతల మధ్య నువ్వానేనా అన్నట్లు మాటల యుద్ధం సాగుతోంది. ఈదఫా ఎన్నికల్లో ఖమ్మం జిల్లావైపు అందరిచూపు మళ్లింది. ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు బరిలో నిలిచారు. ఇరువురు నేతలు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. వీరిమధ్య మాటల యుద్ధంసైతం తీవ్రస్థాయిలోనే సాగుతోంది.
Also Read : BRS Vs Congress : చంపేందుకు కుట్ర- శ్రీధర్ బాబు, పుట్ట మధు పరస్పర ఆరోపణలు
ఖమ్మం నియోజకవర్గంలో అభ్యర్థుల ఎన్నికల ప్రచారపర్వంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తుమ్మల నాగేశ్వరరావు ప్రచార రథంపై నుంచి స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇదే సమయంలో పువ్వాడ అజయ్ కుమార్ ప్రచార కాన్వాయ్ సైతం అటువైపే వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. తుమ్మల ప్రసంగిస్తుండగానే.. పువ్వాడ అజయ్ తన ప్రచార రథంపై నుంచి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగిపోయాడు. తుమ్మలసైతం పువ్వాడ ప్రచార రథాన్ని పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు తమతమ అభ్యర్థులకు మద్దతుగా పెద్దపెట్టున నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం కొద్ది సెంకన్ల పాటు హోరెత్తిపోయింది. అయితే, ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకపోవటంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.