Telangana Farmers
Rythu Bima Scheme: తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు బీమా పథకాన్ని అమలు చేస్తోంది. అయితే, గతేడాదికి సంబంధించి బీమా గడువు ఈనెల 13వ తేదీతో ముగియనుంది. 2025-26 సంవత్సరానికి సంబంధించిన బీమా ఈనెల 14 నుంచి ప్రారంభమవుతుంది. అర్హులైన రైతులు కొత్తగా రైతు బీమా దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల ఫస్ట్వీక్లో అవకాశం కల్పించారు. దీంతో ఈ యేడాది రైతు బీమాకోసం కొత్తగా లక్షలాది అప్లికేషన్లు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి అగ్రికల్చర్ అధికారులకు దరఖాస్తు చేసుకోగా.. వారిలో అర్హులను ఈనెల 9వ తదీ వరకు గుర్తించి రైతు బీమా పోర్టల్ లో అధికారులు అప్లోడ్ చేయనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 76లక్షల మందికి పైగా పట్టాదారు పాస్ బుక్ ఉన్న రైతులు ఉండగా.. వారిలో 18ఏండ్ల నుంచి 59ఏండ్ల మధ్య వయస్సు ఉన్న రైతులు రైతు బీమా పథకానికి అర్హులు. అయితే, గతేడాది రైతు బీమా కలిగిన రైతుల రెన్యూవల్స్ కు సంబంధించి అధికారులు డేటాను పరిశీలించనున్నారు. నిరుడు రైతు బీమా అమలైన వారిలోనూ 60ఏండ్లు నిండిన వారిని తొలగించి మిగతా అర్హులైన రైతులకు బీమా రెన్యూవల్ చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీరి పూర్తి వివరాలను ఏఈవోలు రైతు బీమా పోర్టల్లో రెన్యూవల్ అప్టోడ్ ప్రక్రియను పూర్తి చేస్తారు.
రాష్ట్రంలో గతంలో ఉన్న పట్టాదారుల్లో అర్హత ఉన్నా ఏడు లక్షలకుపైగా రైతులు బీమాకు దరఖాస్తు చేసుకోలేదు. వారికిసైతం ఈసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వ్యవసాయశాఖ అనుమతించనుంది. ఇదిలాఉంటే.. గత జూన్ నెలాఖరు వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతుల్లో బీమాకు అర్హులను ఏవోలు, వ్యవసాయశాఖ అధికారులు గుర్తించే ప్రక్రియ చేపట్టారు. క్షేత్ర స్థాయి వ్యవసాయశాఖ అధికారులు, ఏఈవోలు, ఏఓ స్థాయి, జిల్లా స్థాయిలో అధికారులు అప్లికేషన్లను పరిశీలించి అందులో అర్హులను గుర్తిస్తారు.
రైతు బీమాకు సంబంధించి పాత రెన్యూవల్స్ తో పాటు కొత్తగా అర్హులైన వారివి కలిపి ఈ సంవత్సరం మొత్తం 48లక్షల మందికిపైగా రైతులకు బీమా చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలాఉంటే.. గత ఏడాది ఒక్కో రైతుకు బీమా ప్రీమియం రూ.3,600 వరకు ప్రభుత్వం ఎల్ఐసీకి చెల్లించింది. ఈ సంవత్సరం ఎంత ప్రీమియం అనేది త్వరలో తేల్చనున్నారు.