Telangana 10th students
Telangana : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళ స్నాక్స్ అందించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు మొత్తం 19 రోజుల పాటు వీటిని అందించనున్నారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటి కోసం సమగ్ర శిక్షా అభియాన్ నిధుల నుంచి రూ. 4.23 కోట్లు మంజూరు చేశారు. అయితే, కేవలం 19రోజులు మాత్రమే స్నాక్స్ అందించనుండటం పట్ల ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : Rain Alert : రెయిన్ అలర్ట్.. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వానలు..
రాష్ట్రంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లలోని టెన్త్ విద్యార్థులకు స్నాక్స్ అందించనున్నారు. రాష్ట్రంలో 4,303 హైస్కూళ్లు ఉండగా.. వీటిల్లో పదో తరగతి విద్యార్థులు 1,48,461 మంది ఉన్నారు. రోజుకు ఒక విద్యార్థికి స్నాక్స్ కోసం 15రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాల వారీగా కేటాయించిన బడ్జెట్ ను వెంటనే ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు విడుదల చేయాలని, అక్కడి నుండి స్కూళ్లకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఈసారి పదో తరగతి పరీక్షలు మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మరోవైపు పదో తరగతి స్పెషల్ క్లాసులు అక్టోబర్, నవంబర్ మాసాల్లోనే ప్రారంభమయ్యాయి. అయితే, ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు 19రోజుల పాటు విద్యార్థులకు స్నాక్స్ అందించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
గతేడాది టెన్త్ విద్యార్థులకు 39రోజుల పాటు స్నాక్స్ అందించారని, ఈ ఏడాది కేవలం 19రోజులే ఇవ్వడం సరికాదని టీఆర్టీఎఫ్ పేర్కొంది. స్నాక్స్ ను 45రోజులకు పెంచాలని డిమాండ్ చేసింది. 19రోజులు కాకుండా చివరి పరీక్ష వరకు విద్యార్థులకు స్నాక్స్ ను సమకూర్చాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తితో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే.