Telangana Rythu Bandhu : ఈసారి రూ.7వేల 700కోట్లు.. రైతుబంధుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు
అన్నదాతకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నెల 20వ తేదీ తర్వాత రైతుబంధు అందించేందుకు సిద్ధమవుతోంది.
- Naveen
- Published On : June 18, 2022 / 08:22 PM IST
Telangana Rythu Bandhu
Telangana Rythu Bandhu : తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు నాగళ్లు పట్టారు. పొలం పనులు మొదలు పెడుతున్నారు. ఇదే సమయంలో అన్నదాతకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నెల 20వ తేదీ తర్వాత రైతుబంధు అందించేందుకు సిద్ధమవుతోంది.
జూన్ మొదటి వారం నుంచే రైతుబంధు ఇవ్వాలని అనుకున్నా.. ఆర్థిక సమస్యల కారణంగా 15వ తేదీ ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే, నిధులు సర్దుబాటు కాకపోవడంతో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం ఆలస్యమైంది. ఇప్పుడు నిధులు సమకూరడంతో ఈ నెల 20 తర్వాత రైతుబంధు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
2018లో రైతుబంధు స్కీమ్ ప్రారంభించినప్పుడు మే నెలలోనే ప్రభుత్వం రైతులకు చెక్కులు అందించేది. ఆ తర్వాత కొన్ని సీజన్లలో పెట్టుబడి సాయం అందించడం కాస్త ఆలస్యమైంది. వానాకాలం అయితే జూన్ జూలైలో, యాసంగి పంటలకైతే జనవరి, ఫిబ్రవరి నెలల్లో రైతుబంధు ఇస్తోంది ప్రభుత్వం.
గత యాసంగి సీజన్ నాటికి 66.61 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. 152.91 లక్షల ఎకరాల రైతులకు యాజమాన్యం హక్కులు లభించాయి. అందులో 62.99 లక్షల మంది రైతులకు రూ.7వేల 411.52 కోట్లకు పైగా రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించింది. ఈ సీజన్ లో పట్టాదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం దానికి తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసింది.
Telangana Marijuana : వారికి రైతు బంధు కట్… 148 మంది రైతులపై కేసులు
ఓవైపు కరోనా ప్రభావం, మరోవైపు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లేకపోవడంతో రైతుబంధుకు నిధుల సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం ముందే గుర్తించింది. ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో సీఎస్ సోమేశ్ కుమార్ ఆర్థికశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ముందు జాగ్రత్తగా నిధులు సమీకరించుకోవాలని సూచించారు.
అందుబాటులో ఉన్న అన్ని వనరుల ద్వారా నిధులు సమీకరించుకున్న ప్రభుత్వం రెండు విడతల్లో వారం పది రోజుల వ్యవధిలో రైతుల ఖాతాలో నిధులు జమ చేయనుంది. దానికి తగ్గట్టుగా అధికారులు డేటా డివైడ్ చేస్తున్నారు. మొదట ఎకరం, ఆ తర్వాతి రోజు రెండు ఎకరాలు, ఆ తర్వాత మూడు ఎకరాలు.. ఇలా పదెకరాల వరకు విడతల వారీగా నిధులు జమ చేస్తారు.
Tobacco Farming: పొగాకు సాగుతో నాలుగింతల లాభం
ఈసారి రైతుబంధు కోసం 7వేల 700 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఏకమొత్తం ఒకేసారి వేస్తే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశ్యంతో.. విడతల వారీగా ఈ నెల 20వ తేదీ తర్వాత రైతుబంధును అందించనుంది ప్రభుత్వం.
